Saturday, April 27, 2024

కేరళ సిఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తోపాటు మరి కొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి చట్టం (పిఎంఎల్‌ఎ ) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి సమన్లు జారీ చేయనుంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఒ) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణన లోకి తీసుకుని వీణాతోపాటు ఆమె సంస్థ , మరికొందరిపై ఈడీ పిఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది.

కొచ్చిన్ కేంద్రంగా ఉన్న కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి 201819 మధ్య అక్రమంగా రూ. 1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్ మినరల్స్‌కు ఎక్సాలాజిక్ ఎలాంటి సర్వీస్‌ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్టు ఐటీశాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్ పై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరిపి, అక్రమంగా చెల్లింపులు జరిగినట్టు వెల్లడించింది. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కొట్టాయం జిల్లా పంచాయత్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత పిసి జార్జి కుమారుడు స్టోన్ జార్జి ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. పి.సి జార్జి ఇటీవలనే బీజేపీలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News