Tuesday, May 14, 2024

వైవాహిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ’యూజ్ అండ్ త్రో‘ సంస్కృతి : కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

 

Kerala High Court

కోచి: కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వస్తువులను వినియోగించి తర్వాత పారవేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’ విధానాన్ని అవలంబిస్తున్నారని అభిప్రాయపడింది. లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్ గా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువయిపోయినట్టు తెలిపింది.  తొమ్మిదేళ్లపాటు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు కలిగిన అనంతరం ఓ వ్యక్తి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య తనను వేధింపులకు గురి చేస్తోందని, అందువల్ల విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దానిని ఆ కోర్టు తిరస్కరించింది.

తరువాత ఆయన హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ముహమద్‌ ముస్తాకీ, జస్టిస్‌ సోఫీ థామ్‌సల ధర్మాసనం పరిశీలించింది. ఆ వ్యక్తి చేసిన వినతిని కొట్టి వేస్తూ కుటుంబ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  ‘‘నేటి తరం పెళ్లిని ఓ కీడుగా భావిస్తోంది.బాధ్యతలు, జవాబుదారీతనం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి అదొక ఆటంకమని అనుకుంటోంది.  దేవుని సొంత భూమిగా పేరుపొందిన కేరళలో ఒకప్పుడు బంధాలు పెనవేసుకుపోయిన కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విడాకులు తీసుకోవడం ట్రెండ్‌గా మారింది. వివాహాన్ని పవిత్రమైన కార్యంగా భావించే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. అది వ్యక్తుల శారీరక వాంఛలు తీసుకునేందుకు పొందే లైసెన్సు మాత్రం కాదు. భార్య, పిల్లలను వదిలించుకోవడానికే విడాకులు తీసుకోవాలనుకోవడం తగదు. వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడాన్ని భరించలేకే ఆమె భర్తతో పోట్లాడుతోంది. దీనిని వికృత ప్రవర్తనగా భావించకూడదు. ఆయన తల్లి కూడా కుమారుని ప్రవర్తనపై అసంతృప్తితో ఉన్నారు. భర్త తిరిగి వస్తే కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెబుతోంది. అందువల్ల విడాకులు ఇవ్వడానికి కారణాలు లేవు’’ అని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News