Friday, April 19, 2024

కోల్‌కతా బోణీ

- Advertisement -
- Advertisement -

Kolkata beat Chennai Super Kings by six wickets

చెన్నైకి కెకెఆర్ షాక్

ముంబై: ఐపిఎల్ సీజన్15లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్‌కె 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.3 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లతో 16 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను బ్రావో వెనక్కి పంపాడు. దీంతో 43 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

తర్వాత వచ్చిన నితీష్ రాణాతో కలిసి రహానె ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. రాణా ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. దీంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కానీ 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేసి రాణాను బ్రావో ఔట్ చేశాడు. ఆ వెంటనే రహానె కూడా వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానె ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. కాగా స్వల్ప తేడాతో కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ కెప్టెన్ శ్రేయస్, శామ్ బిల్లింగ్స్ ఇద్దరు సమన్వయంతో ఆడిన కోల్‌కతాను లక్షం దిశగా నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బిల్లింగ్స్ ఒక ఫోర్, సిక్స్‌తో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 20 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఆదుకున్నాడు.

ఆదుకున్న ధోనీ..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (0), కాన్వే (3)లను ఉమేశ్ యాదవ్ వెనక్కి పంపాడు. అయితే రాబిన్ ఉతప్ప దూకుడుగా ఆడాడు. ధాటిగా ఆడిన ఉతప్ప రెండు ఫోర్లు, మరో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. రాయుడు (15) కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. శివమ్ దూబే (3) కూడా నిరాశ పరిచాడు. దీంతో చెన్నై 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రవీంద్ర జడేజాతో కలిసి మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసిఅజేయంగా నిలిచాడు. కెప్టెన్ జడేజా 26 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. దీంతో చెన్నై స్కోరు 131 పరుగులకు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News