Wednesday, May 1, 2024

గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం

- Advertisement -
- Advertisement -

గ్రూపు రాజకీయాలకు తావివొద్దు
గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలి
ముఖ్య నేతలతో 40 నిమిషాల పాటు మంత్రి కెటిఆర్ ప్రత్యేక భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. శనివారం ఖమ్మంలో పర్యటించిన మంత్రి కెటిఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసంతృప్త నాయకులు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా 40 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టిఆర్‌ఎస్ ప్రాతినిథ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా వారికి సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ దిశగా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపి నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్‌లకు మంత్రి కెటిఆర్ క్లాస్
ఖమ్మం నూతన మున్సిపల్ కార్యాలయంలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కెటిఆర్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ టిఆర్‌ఎస్ కార్పొరేటర్లకు క్లాస్ ఇచ్చారు. కొందరు కార్పొరేటర్ల పనితీరు సరిగా లేదని, ఇంట్లో కూర్చుంటే కుదరదని, మంచిగా పనిచేసి ప్రజల మనసును గెలుచుకోవాలని ఆయన సూచించారు. వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయన హెచ్చరించారు.

KTR Meets Corporators in Khammam Municipal Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News