Sunday, April 28, 2024

ప్రైవేట్ కుట్ర ఆపండి

- Advertisement -
- Advertisement -

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్,
ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్‌ప్లాంట్‌ను క్రమంగా చంపే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నదని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడటం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర
ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్‌ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేట్‌పరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలుచేసి, వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు.

దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40 శాతం లోపే ఉన్నదని చెప్పారు. పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి విషయంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్‌లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు.
నష్టాల్లోకి నెట్టాలని పన్నాగం
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి కెటిఆర్ దుయ్యబట్టారు. మరోవైపు పూర్తిస్థాయిలో కోకింగ్ కోల్ విదేశాల నుంచే తీసుకురావాల్సిన పరిస్ధితి ఉండడం, స్టీల్ ప్రొడక్షన్‌కు అవసరమైన ఐరన్ ముడి సరుకును సైతం ఎన్‌ఎండిసి నుంచే మార్కెట్ రేట్‌కే కొనుగోలు చేయాల్సి రావడంతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. దీంతో ఏడాది కాలంగా సగానికి పైగా ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చిందని, ఇదంతా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి, ఆ నష్టాలను సాకుగా చూపించి, ప్రైవేట్ పరం చేయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతుందని కెటిఆర్ హెచ్చరించారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు రూ.12.5 లక్షల కోట్లు రద్దు చేసిన ప్రధాని మోదీకి, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు.
వర్కింగ్ క్యాపిటల్ పేరుతో..
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కి 7.3 ఎంటిపిఎ సామర్థ్యం ఉన్నా.. కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం సామర్థ్యానికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే పూర్తిస్థాయి కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి స్టీల్‌ప్లాంట్ లాభాల బాట పడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను వర్కింగ్ కాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని సూచించారు. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దాదాపు రూ.లక్ష కోట్లతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని గుర్తు చేశారు.

లక్ష కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్‌లో భారీ విస్తృత ప్రణాళిక ప్రకటించిన ఈ సంస్థను వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌తో కలపవచ్చని సూచించారు. దీంతో తక్కువ ధరకి ప్రైవేట్ సంస్థలకు అమ్మడం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. సేయిల్ సంస్థ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సెయిల్ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పైగా దేశ మౌలిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా భద్రత ప్రైవేట్ కంపెనీల దాయాదాక్షిణ్యాల మీద అధారపడాల్సిన అవసరం ఉండదని సూచించారు.
స్టీల్‌ప్లాంట్‌కు రుణ సౌకర్యం కల్పించాలి..
దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం దాదాపు రూ.25వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని మంత్రి తెలిపారు. అయితే అదే స్థాయిలో ఆస్తులు లేదా విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. ప్రైవేట్ కంపెనీలతో సమానంగా కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని కల్పించి, బ్యాంకుల ద్వారా మరింత మూలధనాన్ని ఇప్పిస్తే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తన కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలతో సమానంగా పోటీపడేలా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన మేరకు కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని కెటిఆర్ సూచించారు.

గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన పి.వి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయ్ హయాంలో ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు నిధులను నేరుగా కేటాయించిన ఉదంతాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోరుతున్నట్టు.. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించి, అందుకు సరిపడా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వం ఇచ్చిన నగదును తిరిగి 2008లో వడ్డీతో సహా వైజాగ్ స్టీల్ ప్లాంట్ చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గుర్తు చేశారు.
ఆ నోటీసును రద్దుచేయాలి..
ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఆసక్తి వ్యక్తీకరణ నోటీసును కేంద్రం వెంటనే రద్దు చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే దేశంలో భారీ ఎత్తున చేపడుతున్నామని చెప్పుకుంటున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేరుగా స్టీల్‌ను కొనుగోలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ సొమ్ములను అందించి, స్టీల్ కోనుగోలు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఇవేవి కాకుండా కేవలం ప్రైవేట్ కంపెనీలను వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోకి ప్రవేశపెట్టాలన్న దురుద్దేశంతో ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కనీసం ఇందులో ఏర్పాటు చేసుకోబోయే ఒప్పందం తాలుకు నిర్దిష్ట నిబంధనలు సైతం పెర్కోనలేదని, ఇది కేవలం ఈ మధ్యనే భారీగా తన సంపద కోల్పోయి, ప్రపంచ ఆర్థిక కుబేరుడి జాబితాలో స్ధానం పడిపోయిన తమ మిత్రుని కంపెనీతో తగిన విధంగా ఒప్పందం చేసుకునేందుకు ఈ అంశంలో కేంద్రం స్పష్టతనివ్వలేదని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా..
ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తుందని కెటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జాతికి తీరని నష్టాన్ని కలిగించిందన్నారు. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ సంస్థలను, కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేట్ పరం చేస్తున్న ప్రధాని మోదీ, ప్రస్తుతం లాభాలతో నడుస్తున్న నవరత్నాలాంటి కంపెనీలను కూడా అమ్మేసే కుట్రలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. లాభాలను ప్రవేట్‌పరం చేస్తూ, నష్టాలను జాతీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనం చేస్తూ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో కేంద్రంలోని బిజెపి స్పష్టం చేయాలని అన్నారు.
ప్రజలను చైతన్యవంతం చేస్తాం..
బిఆర్‌ఎస్ ఒక పార్టీగా వైజాగ్ సీట్‌ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ధి తమకు ఉన్నదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమ అనుకూల ప్రైవేట్ కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అప్పజెప్పాలన్న కుట్రను చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఎదుర్కొని వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కొన్ని స్వార్థపూరిత శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమని మంత్రి కుండబద్దలు కొట్టారు.

కేవలం వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతోనే కేంద్రం కుట్రలు ఆగదని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను భారీ ఎత్తున తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, సింగరేణి వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంతిమంగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోయేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు బిఆర్‌ఎస్ సిద్ధంగా ఉంటుందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లేపిన ఈ సరికొత్త కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ బిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌కు కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News