Sunday, April 28, 2024

ప్రధాని మోదీకి ఉత్తరాల ఉప్పెన

- Advertisement -
- Advertisement -

చేనేతపై జిఎస్‌టిని రద్దు
చేయాలంటూ లక్షల్లో ఉత్తరాలు

n చేనేతపై జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలన్న నినాదంతో పోస్టు కార్డుల ఉద్యమం
n నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో లక్షలాది ఉత్తరాలను ప్రదర్శించిన నేతన్నలు n కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు n ర్యాలీగా వెళ్లి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డులను పోస్ట్ చేసిన వందలాది నేతన్నలు n పాల్గొన్న ఎంఎల్‌సి ఎల్. రమణ, మాజీ ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్

మన తెలంగాణ/హైదరాబాద్ : చేనేత పైన జిఎస్‌టిని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లక్షలాది ఉత్తరాలను సోమవారం హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన లక్షలాది ఉత్తరాల సంచులతో నేతన్నల సంక్షేమ సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు, నేతన్నల సామాజిక వర్గాలు, టిఆర్‌ఎస్ పార్టీ నేతలు హైదరాబాదులోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భారీగా ప్రదర్శించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో నేతన్నలు నిజాం కాలేజ్ నుంచి ఉత్తరాలను తీసుకొని అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అంతకుముందు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వేదిక వద్ద లక్షలాది ఉత్తరాలను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్న చేనేత వస్త్రాల జిఎస్‌టి పైన పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు నేతన్నల సంక్షేమానికి గతంలో ఉన్న జీవిత బీమా, యార్న్ సబ్సిడీ వంటి కార్యక్రమాలను పునరుద్ధరించాలన్నారు. అలాగే రద్దు పరిచిన హ్యాండ్లూమ్, పవర్ లూమ్ వంటి బోర్డులను వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని నినదించారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఎల్ రమణ , మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వారికి ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం రద్దు చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా వారు చేనేత వృత్తి నుంచి దూరం అవుతున్నారని ఈ సందర్భంగా రమణ, రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం అత్యంత కీలకమైన ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపైన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిఎస్‌టిని విధించడం అత్యంత దారుణమన్నారు. పైగా ఐదు శాతం ఉన్న జిఎస్‌టిని చేనేత వస్త్రాలపై 12 శాతానికి పెంచేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేసిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనల వలన ప్రస్తుతం దానిని నిలిపివేసిందన్నా రు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేనేతపైన ఉన్న ఐదు శాతం జిఎస్‌టిని కూడా పూర్తిగా ఎత్తివేయాలన్న ఏకైక నినాదంతో తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలు లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రికి రాశారన్నారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం చేనేతపైన జిఎస్టిని పూర్తిగా రద్దు చేయాలన్నారు.

అప్పటిదాకా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. లక్షలాది పోస్ట్ కార్డులను ప్రధానమంత్రి మోడీకి పంపించడం ద్వారా చేనేత కార్మికు లు తమ దుఃఖాన్ని, బాధను ప్రధానమంత్రి కి తెలియజేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ పోస్ట్ కార్డులను అందుకున్న తర్వాత ఆయినా ప్రధానమంత్రి వెంటనే స్పందించి చేనేతపైన ఉన్న జిఎస్‌టిని పూర్తిగా రద్దు చేయాలని రమణ, రాపోలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడురి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత కర్నాటి విద్యాసాగర్, వివిధ పద్మశాలి సంఘాల ప్రతినిధులు, రాష్ట్రంలోని చేనేత కార్మికుల సొసైటీలు, వాటి ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చిన వివిధ జిల్లాల నేతన్నలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News