పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు స్వంత ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య “రెబెల్”గా ఎదురుతిరిగి తనతండ్రి, సోదరులు తేజస్వియాదవ్, తేజప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి సూచనలను ఏమాత్రం సోషల్ మీడియాలో ఖాతరు చేయడం లేదు. కాకలు తీరిన రాజకీయ యోధుడు లాలూప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఒకేసారి మూడు పోరాటాలు చేయవలసి వస్తుంది. మొదట ఆయన న్యాయ పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు . కేంద్ర రైల్వే మంత్రిగాఆయన ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఐఆర్సిటిసి స్కామ్లో వచ్చేనెల తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావచ్చు. రెండోది రాజకీయ యుద్ధం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎన్డిఎతో ఢీకొని ముఖ్యమంత్రి పీఠంపై తన కుమారుడు తేజస్వీయాదవ్ను కూర్చుండబెట్టడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మూడోది చాలా నాటకీయంగా ఇంటిపోరునే ఎదుర్కొంటున్నారు.
రోహిణీ ఆచార్య తండ్రి లాలూప్రసాద్ను కానీ, సోదరులు తేజస్వియాదవ్, తేజ్ ప్రతాప్, సోదరి మీసా భారతి ( లోక్సభ ఎంపీ) ని కానీ సోషల్ మీడియాలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తేజస్వియాదవ్ నమ్మకస్తుడైన రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ వల్ల ఈ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణీ పోటీ చేయాలనుకుంటే సంజయ్ సలహాపై తేజస్వి ఆమెకు ఏమాత్రం మద్దతు ఇవ్వడం లేదని రోహిణీ అనుమానిస్తున్నారు. అంతేకాక తన కుమారుడు తేజస్వియాదవ్కు అండగా గట్టిగా నిలబడి కుమార్తెను విస్మరించారు.
ప్రస్తుతం ఆమె తన భర్త షంషేర్ సింగ్, దివంగత రచయిత రాహత్ ఇండోరీ అభిప్రాయాలను, మీడియా సంస్థలను విశ్వసిస్తున్నారు. ఎవరైనా తన కిడ్నీని తండ్రి లాలూకు దానం చేయలేదని నిరూపిస్తే రాజకీయ, ప్రజాజీవితం నుంచి తప్పుకుంటానని ఆమె సవాలు విసురుతున్నారు. కుటుంబంలో తలెత్తిన విభేదాలకు ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Also Read: ఐరాసలో చేదు అనుభవాలు.. సీక్రెట్ సర్వీస్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశం