Thursday, May 2, 2024

5 నిమిషాల్లో మ్యుటేషన్

- Advertisement -
- Advertisement -
Land mutation in 5 minutes in Telangana
గత నెల నుంచే అందుబాటులోకి పురపాలక, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య తొలగిన
సాంకేతిక సమస్యలు ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అందుతున్న మ్యుటేషన్ సర్టిఫికెట్

మనతెలంగాణ/ హైదరాబాద్: రోజులు తరబడి, నెలల తరబడి తిరిగి మ్యుటేషన్ కోసం తిరగాల్సిన దుస్థితికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. పురపాలక, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య ఉన్న సాంకేతిక సమస్యలు తొలగిపోవడంతో మ్యుటేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. రిజిస్ట్రేషన్ అయిన ఐదు నిమిషాల్లోనే మ్యుటేషన్ సర్టిఫికెట్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అందిస్తోంది. గతంలో రాష్ట్రంలో మ్యుటేషన్ చేయించుకోవడం పెద్ద సవాల్‌గా ఉండేది. ఆస్తులు క్రయ విక్రయాలు జరిగినా కొనుగోలుదారులు తమ పేర్లతో ఆస్తులు మార్చుకోవాలంటే పురపాలక, పంచాయతీ శాఖల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి ఉండేది. మ్యుటేషన్ కోసం అన్ని రకాల డాక్యుమెంట్లతో తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఇలా అన్ని పత్రాలు అందజేసినా మ్యుటేషన్ అయ్యేది కాదు.

కాళ్లు అరిగేలా ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగి అడిగిన ప్రతి కాగితం అందించినా సుమారుగా ఏడాది కాలం పట్టేది. ఈ పరిస్థితులను పూర్తిగా రూపుమాపి.. సునాయాసంగా మ్యుటేషన్ అయ్యేట్లు సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌ను అనుసంధానం చేసింది. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులే సర్టిఫికెట్‌ను జారీ చేసేటట్లు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట ఈ రెండు సర్వర్ల అనుసంధానం కాకపోవడం అడుగడుగునా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో వాటిని అధిగమించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఇన్ని రోజుల తరువాత ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో రెండు నెలలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యుటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

గత నెల రెండో వారంలో ఈ అటోమెటిక్ మ్యుటేషన్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆ తర్వాత ఒక్కొక్కటి సమసిపోయింది. సాంకేతిక సమస్యలు పూర్తిగా తొలగిపోవడంతో మ్యుటేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,19, 750 డాక్యుమెంట్లు అటోమేటిక్‌గా మ్యుటేషన్ అయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 48,950, రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల పరిధిలో 65,018 మ్యుటేషన్‌లు పూర్తయ్యాయి. ఇక పంచాయతీరాజ్ పరిధిలో 48,590 డాక్యుమెంట్లు, వరంగల్ మున్సిపల్ పరిధిలో 5,600 డాక్యుమెంట్లు మ్యుటేషన్ పూర్తయ్యినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News