నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటన
స్కూళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బార్లు, ఫంక్షన్లు, అన్ని మతాల ధార్మిక కార్యకలాపాలను జూన్ వరకు బంద్ చేయాలని పలు రాష్ట్రాల సూచన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్డౌన్ను మరికొంతకాలం పొడిగించాలన్న పలు రాష్ట్రాల అభ్యర్థనలు, నిపుణుల సూచనలపై కేంద్రం దృష్టిపెట్టింది. తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర రావు లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తేనే కరోనాను కట్టడి చేయగలమని సోమవారం నాడు ఘంటాపథంగా చేసిన ప్రకటనతో మంగళవారం నాడు పలు రాష్ట్రాలు ఏకీభవించాయి. కెసిఆర్ అభిప్రాయానికి మెజారిటీ రాష్ట్రాలు కూడా మద్ధతు పలికాయి. దీంతో కేంద్రం కూడా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలపై ఆలోచన చేస్తోంది.
ప్రధాని మోడీ ప్రకటించిన మూడు వారాల లాక్డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం, తూర్పుఢిల్లీ, తమిళనాడు, ముంబయి లాంటి కొన్ని ప్రా ంతాల్లో ఈ మహమ్మారి సమూహవ్యాప్తి దశకు చేరుకుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించే విషయాన్ని ప్రభుతం పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పా రు.లాక్డౌన్పై సంప్రదింపులు జరుగుతున్నాయని, అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదరి లవ్ అగర్వాల్ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఎలా ంటి ఊహాగానాలను నమ్మవద్దని ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్టా లాక్డౌన్ను పొడిగించక తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే స్పష్టంగా చెప్పడం తెలిసిందే.ఈ మహమ్మారి బారినుంచి మనం ముందు ప్రజల ను రక్షించుకోవాలని, ఆర్థిక వ్యవస్థను త ర్వాత చక్కదిద్దుకోవచ్చని కూడా ఆయన అన్నారు. యుపి, మహారాష్ట్ర, కర్నాటక, మ ధ్యప్రదేశ్ , రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాలు కూడా ఏప్రిల్ 14 తర్వాత అన్ని ఆంక్షలను ఒకేసారి ఎత్తివేయడానికి సుముఖంగా లేవు. లాక్డౌన్ను కొనసాగిస్తే కరోనా కట్టడి సులువు అవుతుందని రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేశాయి.
మంత్రుల గ్రూపు భేటీ
ఇదిలా ఉండగా ఒక వేళ లాక్డౌన్ను ఎత్తివేసిన పక్షంలో తలెత్తబోయే పలు అంశాలను చర్చించడం కోసం మంగళవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల గ్రూపు ఆయన నివాసంలో సమావేశమైంది. ఒక వేళ లాక్డౌన్ను ఎత్తివేసినా ఆ ప్రయాణ ఆంక్షలు కొనసాగించాలనే స్పష్టమైన అభిప్రాయానికి మంత్రులు వచ్చినట్లు ఈ సమావేశం గురించి బాగా తెలిసిన ఓ అధికారి చెప్పారు. కాగా ఇప్పటివరకు మంత్రుల గ్రూపు సమావేశం కావడం ఇది నాలుగో సారి. సాధారణంగా రాజ్నాథ్ సింగ్, లేదా హోంమంత్రి అమిత్షా ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తుంటారు. కాగా మంగళవారం జరిగిన సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా 14 మంది ఇతర మంత్రులు హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిస్తోంది.
లాక్డౌన్ కారణంగా పంటల కోత సీజన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్న భయాందోళనలను పలువురు మంత్రులు ఈ సమావేశంలో వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. వ్యవసాయ రంగానికి ప్రకటించిన ప్రత్యేక రాయితీలు కిందిస్థాయిలో రైతులకు చేరడం లేదని, కూలీలు సైతం తిరిగి పనులకు వెళ్లడానికి భయపడుతున్నారని అధికారులు మంత్రులకు వివరించినట్లు ఆ అధికారి చెప్పారు. అలాగే దేశంలో మందులకు ఎలాంటి కొరత లేనప్పటికీ వాటిని సరఫరా చేయడానికి సిబ్బందిలేకపోవడం వల్ల సరఫరాలో ఇబ్బంది ఎదురవుతున్నట్లు కూడా సమావేశం దృష్టికి అధికారులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కాగా విద్యాసంస్థలు, అన్ని మతాల ధార్మిక కార్యకలాపాలను జూన్ వరకు పూర్తిగా బంద్ చేయాలని, లాక్డౌన్ను కొనసాగించాలని మెజారిటీ రాష్ట్రాలు కేంద్రానికి సూచించినట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ 11 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలకు వివిధ రాష్ట్రాలనుంచి అందిన నివేదికలన్నీ కూడా దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయడానికి లాక్డౌన్ను పొడిగించడానికే మొగ్గు చూపాయి. పరిస్థితి మెరుగుపడే వరకు హోటళ్లు , రెస్టారెంట్లు, బార్లను కూడా మూసి వేయాలని, పెళిళ్లు, అంత్యక్రియలులాంటి పబ్లిక్ ఫంక్షన్లు, కార్పొరేట్ మీటింగ్లు లాంటివి కూడా లాక్డౌన్లోనే కొనసాగాలని సూచించాయి.
లాక్డౌన్ పొడిగించినా ప్రజలు సహకరించాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య
దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 21 రోజుల లాక్డౌన్ ముగింపు ప్రణాళికను రూపొందించడంలో రానున్న ఏడు రోజులు అత్యంత కీలకమైనవని, కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారం ఆధారంగానే లాక్డౌన్ ఎత్తివేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతిమంగా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజలు కట్టుబడి ఉండాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.
కరోనా లేదు.. లాక్డౌన్ ఎత్తేస్తాం : మేఘాలయ
కరోనా కారణంగా దేశంలో చాలా రాష్ట్రాలు ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలయితే లాక్డౌన్ను పొడిగించాలని కోరాయి కూడా. అయితే ఈశాన్య భారతంలోని మేఘాలయ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. లాక్డౌన్ను పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అక్కడి రాష్ట్రప్రభుత్వం మంగళవారం అధికారిక ప్రకటన కూడా చేసింది.