మహబూబ్నగర్: భారతీయ జనతా పార్టీకి మహబూబ్నగర్ లో బిగ్ షాక్ తగిలింది. జిల్లా బిజెపి అధ్యక్షపదవికి మాజీ ఎంఎల్ఎ ఎర్ర చంద్రశేఖర్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ నోట్ విడుదల చేశారు. మాజీ ఎంపి జితేందర్ రెడ్డి ఇంట్లో బండి సంజయ్ తో పాటు ఎర్ర శేఖర్ టిఫిన్ చేశారు. అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల తాను జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే మీడియాకు ఫోన్ ద్వారా వెల్లడించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎర్ర శేఖర్ రాజీనామకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడంతో పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు అయింది. పార్టీలో అంతర్గత విభేదాలు మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆదివారం తార్నాక డివిజన్ లోని సికింద్రాబాద్ లో బిజెపి కార్యకర్తలు రోడ్డుపైనా కొట్లాటకు దిగారు.