Sunday, April 28, 2024

మోడీ సర్కార్‌పై ఖర్గే ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలో 10 సంవత్సరాల తన పాలనలోని వైఫల్యాలను కపిపుచ్చుకునేందుకు బిజెపి భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమైక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఏర్పడిన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నాయకులతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు భారత్ జోడో యాత్రను విజయవంతంగా నిర్వహించిన రాహుల్ గాంధీని అభినందించిన ఖర్గే త్వరలో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్ర సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి, జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలోని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తున్న బిజెపి ప్రతి విషయంలోను కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. బిజెపి అబద్ధాలను, మోసాలను, తప్పులను క్షేత్రస్థాయిలో ప్రజల ముందు ఎండగట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. తమ విభేదాలను పక్కనపెట్టాలని ఆయన పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ అంతర్గత అంశాలను మీడియా ముందు ప్రస్తావించవద్దని కోరారు.

సోనియా కృషి వల్లే అధికారంలోకి యుపిఎ
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 25 సంవత్సరాల పాటు సేవలందచేసిన సోనియా గాంధీని తాను ఎంతో గౌరవిస్తానని, 2004లో ఎన్‌డిఎని ఓడించి యుపిఎ 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగడానికి రామంగా శ్రమించారని ఆయన గుర్తు చేశారు.అదే అంకితభావంతో ఇప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కష్టపడి పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి దాడులన్నీ కాంగ్రెస్, ఇండియా కూటమిపైనేనని ఆయన చెప్పారు. ఎన్‌డిఎ నామమాత్రమేనని, కాని ఇండియా కూటమి క్షేత్రస్థాయిలో ఉందని ఆయన చెప్పారు.

నవ భారత నిర్మాణంలో కాంగ్రెస్ పాత్రను ఉద్దేశపూర్వకంగానే బిజెపి విస్మరిస్తోందని, దీనికి తామంతా బలంగా సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాది వేసిన కాంగ్రెస్ నాయకుల సేవలను పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. చరిత్రను మరిచిన వారు చరిత్రను సృష్టించలేరని ఆయన వ్యాఖ్యానించారు. రేయింబవళ్లు పనిచేయడం ద్వారా లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందచేయగలమని ఆయన చెప్పారు. ఇలా ఉండగా, రానున్న లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని, ఇతర పార్టీలతో సీట్ల పంపకాన్ని, జనవరి 14 నుంచి మొదలు కానున్న భారత్ న్యాయ యాత్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చర్చించారు.

ప్రజలను లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయినప్పటికీ దేశంలో మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. గడచిన 19 నెలల్లో ముడి చమురు ధరలు 31 శాతం తగ్గాయంటూ గణాంకాలతో కూడిన పట్టికను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే సంబంధిత మంత్రి మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రసక్తి లేదంటూ ప్రకటిస్తున్నారని ఖర్గే తెలిపారు. ముడి చమురు ధరలు పడిపోతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం సాగిస్తున్న లూటీపై నియంత్రణ లేకుండా పోయిందని ఆయన తెలిపారు.

ధరల తగ్గింపుపై చమురు కంపెనీలతో చర్చలు జరపడం లేదని మోడీ ప్రభుత్వంలోని మంత్రులే స్వయంగా చెబుతున్నారని ఆయన చెప్పారు. పెట్రల్‌పై లీటరుకు రూ. 8 నుంచి రూ. 10, డీజిల్‌పై రూ. 3 నుంచి రూ. 4 చొప్పున ప్రజల నుంచి చమురు కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని ఆయన తెలిపారు. గడచిన 50 ఏళ్లలో న్నడూ లేని విధంగా దేశంలో ప్రజల పొదుపు ఖాతాలు దారుణంగా క్షీణించాయని, బిజెపి చెబుతున్నఅచ్చే దిన్ వారి బూటకపు ఉపన్యాసాలు, డొల్ల ప్రకటనలలో మాత్రమే కనపడుతోందని ఖర్గే విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News