కోల్కతా : పశ్చిమబెంగాల్ గురించి కేంద్రమంత్రి అమిత్షా చెప్పేవన్నీ అబద్ధాల చెత్త అని సోమవారం ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధిపై ఆయన చెప్పే గణాంకాలన్నీ అబద్ధాలే అని ఆమె ఆరోపించారు. పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 28న అధికారిక సమావేశంలో పాల్గొనడానికి తాను బీర్భమ్ జిల్లాను సందర్శిస్తానని ఆ మరునాడు రోడ్షో నిర్వహిస్తానని ఆమె చెప్పారు. ఆదివారం నాడు బోల్పూర్ పత్రికా సమావేశంలో కేంద్రమంత్రి అమిత్షా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా అవినీతి, అధికార దుర్వినియోగంలో తప్ప మిగతా అన్ని రంగాల్లో పశ్చిమబెంగాల్ వెనుకబడి ఉందని ఆరోపించారు.
దీనిపై మమత స్పందిస్తూ హోంమంత్రి అయి ఉండి అబద్ధాలు చెప్పడం తగదని, ఎలాంటి తనిఖీ చేయకుండా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన అబద్ధపు సమాచారంపై మాట్లాడరాదని మమతాబెనర్జీ ఘాటుగా అమిత్షాపై విరుచుకుపడ్డారు. షా ఆరోపణలకు తాను మంగళవారం దీటుగా జవాబిస్తానన్నారు. పారిశ్రామికంగా తాము జీరో అన్ని షా ఆరోపించారు. కానీ ఎంఎస్ఎంఇలో తామే నెంబర్ వన్గా ఉన్నామని మమత పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో తాము అట్టడుగున ఉన్నామని షా ఆరోపించారు. కానీ అందులోనూ తామే ముందున్నామని మమత పేర్కొన్నారు. ఈ లెక్కలు కేంద్ర ప్రభుత్వం వెల్లడించినవేనని ఆమె స్పష్టం చేశారు.