ఎయిర్గన్తో అమ్మాయి అన్నకు బెదిరింపులు
జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో ఘటన
పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
జవహర్నగర్: ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడమేకాక యువతి సోదరున్ని ఎయిర్గన్తో బెదిరించిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన శుక్రవారం జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మధుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన యువతి (22) దమ్మాయిగూడలో నివసించే తన బంధువుల ఇంట్లో ఉంటూ కీసరలోని గీతాంజలి కాలేజీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది. కాగా కాప్రా సర్కిల్ సాయిబాబానగర్లో నివసించే అభిషేక్ (22) అదే కాలేజీలో బిటెక్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకున్నారు. ఇటీవల యువతిని తల్లిదండ్రులు మందలించడంలో అభిషేక్ను దూరం పెట్టింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి యువతిని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
అంతేగాక యాసిడ్ పోసి చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తన సెల్ఫోన్లో ఉన్న యువతి ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడంతో భయపడిపోయిన యువతి తన అన్న భానుప్రకాశ్కు చెప్పింది. ఈ విషయమై అతను అభిషేక్కు ఫోన్ చేసి మాట్లాడుదామని చెప్పి పద్మశాలి టౌన్షిప్కు పిలిచాడు. అయితే భాసుప్రకాశ్పై దాడి చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్న అభిషేక్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఎయిర్గన్తో అక్కడకు వెళ్లి భానుప్రకాశ్ను బెదిరించాడు. దీంతో భానుప్రకాశ్ స్నేహితులు, స్థానికులు కలిసి అభిషేక్తో పాటు, అతని స్నేహితులను పట్టుకొని జవహర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. నిందితుడు స్నాప్డీల్లో బొమ్మ తుపాకీని కొనుగోలు చేసినట్లు ఇన్స్పెక్టర్ మధుకుమార్ తెలిపారు.