వేగవంతమైన వ్యాక్సినేషన్లో
భారత్కు రెండో స్థానం: ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు 34 రోజుల్లో కోటికిపైగా టీకా డోసులు ఇవ్వడం ద్వారా భారత్ రికార్డు నెలకొల్పిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వేగంగా వ్యాక్సినేషన్ను నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ది రెండోస్థానమని పేర్కొన్నది. కోటి డోసుల వ్యాక్సినేషన్కు అమెరికాకు 31రోజులు, యుకెకు 56 రోజుల సమయం పట్టిందని తెలిపింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా దేశంలో 1,01,88,007 టీకా డోసుల్ని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్స్కు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తం డోసుల్లో మొదటి డోస్ పొందిన ఆరోగ్య కార్యకర్తలు 62,60,242కాగా, వీరిలో రెండో డోసు కూడా పొందినవారు 6,10,899మంది, మొదటి డోస్ పొందిన ఫ్రంట్లైన్ వర్కర్స్ 33,16,866మంది. ఈ నెల 18న(34వ రోజున) మొత్తం 6,58,674 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
వీటిలో మొదటి డోస్ పొందినవారి సంఖ్య 4,16,942 కాగా, రెండో డోస్ పొందినవారి సంఖ్య 2,41,732. శుక్రవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో దేశంలో 13,193 కేసులు, 97మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 10,896మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,542. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం మాత్రమే. కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా మహారాష్ట్రలో 5427,కేరళలో 4584, తమిళనాడులో 457.మరణాల్లో అధికంగా మహారాష్ట్రలో 38, కేరళలో 14, పంజాబ్లో 10 ఉన్నాయి.