Sunday, April 28, 2024

వరంగల్ ఎంపి బరిలో మంద కృష్ణ మాదిగ

- Advertisement -
- Advertisement -

సమాలోచనలు చేస్తున్న కమలనాథులు
ఆయనతో పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం
ఇటీవల అమిత్‌షా పర్యటనలో చర్చించినట్లు సమాచారం
మూడోసారి కేంద్రంలో కొలువుదీరిన తరువాత ఎస్సీవర్గీకరణ చేస్తాం
దళితులకు రాజకీయ దారులు బిజెపి చూపిస్తుందని పార్టీ సీనియర్ల వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు కమలనాథులు కుస్తీ పడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎంపి సీట్లపై ఫోకస్ పెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఊహించని విధంగా 4 ఎంపి సీట్లు గెలిపించారు. ఈసారి కూడా ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారని బిజెపి పెద్దలు అంచనా వేస్తూ రాజకీయ వ్యుహాలకు పదును పెడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిసి సిఎం, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రచారం చేపడితే 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు మరో 10 స్ధానాల్లో అభ్యర్థులు రెండవ స్ధానంలో నిలిచారు. దీంతో మరోసారి దళిత, బహుజనుల రాజ్యాధికారమే అంశాలతో ప్రజల వద్దకు వెళ్లేందుకు బిజెపి సిద్దమైతున్నట్లు తెలిసింది.

అందుకోసం ఈసారి ఏకంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపకులు, ప్రజా ఉద్యమాల నేత మంద కృష్ణ మాదిగను ఎన్నికల క్షేత్రంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఆయన సొంత జిల్లా వరంగల్ నుండి ఎంపి అభ్యర్ధిగా నిలబెడితే ఆ సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో పడవచ్చని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పలు జిల్లాలో ప్రచారం చేసి బిజెపితో మాదిగలకు న్యాయం జరుగుతుందని, ఈసారి తమ ఓట్లు కమలం పార్టీ వేయాలని అనుచరులు, సామాజిక వర్గం పెద్దలకు సూచించారు. దీంతో పలు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులకు ఆశించిన స్దాయిలో ఓట్లు వచ్చాయి. దీంతో ఈసారి ఉద్యమనేత మంద కృష్ణను బరిలోకి దించితే పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కుతామని, ఆయన విజయం సాధిస్తే వచ్చే సర్కార్‌లో వర్గీకరణ బిల్లు పెట్టి వారి కోరిక నేరవేరుతామని ఆపార్టీ పెద్దలు చెబుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ నియోకవర్గాల్లో ఆయన సూచించిన వారికే టికెట్లు కూడా ఇస్తామని పేర్కొంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ యుద్ధభేరి సభకు వచ్చిన జనం చూసి హస్తిన బిజెపి పెద్దలు కంగుతిన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాలను తరలించడం అషామాషి విషయం కాదని, మందకృష్ణ మన వెంట ఉంటే తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉందని డిల్లీ నేతలు పలు సందర్బాల్లో పేర్కొన్నారు.  పార్లమెంటు పోరులో ఎస్సీల ఓట్లు గంపగుత్తగా పడే విధంగా కమలం పెద్దలు తమకు వచ్చిన రాజకీయ విద్యలు ప్రదర్శించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చి కొంగర కలాన్‌లో రాష్ట్ర స్దాయి సమావేశం నిర్వహించి గతంలో గెలిచిన నాలుగు పార్లమెంటు స్దానాల్లో సిట్టింగ్‌లు పోటీ చేస్తారని, మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలబలాలపై సర్వే చేసి టికెట్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో పలు స్ధానాల్లో పోటీ చేసేందుకు ఆశావాహాలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వరంగల్ ఎంపి అభ్యర్ధిగా తమ పేర్లు పరిశీలించాలని ఆపార్టీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి, మాజీ ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్‌కు కోరుతున్నారు. ఈసారి అభ్యర్ధులు ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముందని, ప్రధాని మోడీ దేశ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తామని ఆపార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News