Thursday, May 2, 2024

అవిశ్వాసానికి మరొక్క ఛాన్స్!

- Advertisement -
- Advertisement -

చూశారా! నేను ఊహించినట్లే మా ప్రభూజీ ప్రతిష్ఠను మంట కలపాలని చూసిన ప్రతికక్ష తీర్మానం తుస్సుమంది!!మా కూటమిలో లేకున్నా ఆంధ్రా ఎంపిలందరూ ఎంత విశ్వాసం ప్రకటించారని! బూతు కత్తులతో తమలో తాము ఎంత రక్తం పారేట్లు చీరుకున్నా, తెలుగు తల్లి ప్రపంచం ముందు సిగ్గుతో తల దించుకునేటట్లు సుందోపసుందుల్లా కాట్లాడుకున్నా, మా ప్రభూజీ ‘జూ’ అనగానే పిల్లులుగా మారిపోయారు కారా!!ప్రపంచాధినేతలే మా ప్రభూజీని విశ్వగురుగా సంభావిస్తుంటే, మేమేదో అహంభావంతో దంభాలు కొట్టుకుంటున్నామన్నట్లు కొందరు మాట్లాడతారేంటి?ముందుగా పార్లమెంటులో మొదటి ఎజెండాగా మణిపూర్‌పై చర్చ జరగాలట! అలా జరిగేట్లు చేయాలని ప్రతికక్షులు ఎంత పట్టుబట్టినా దాన్ని చివరి అంశం కిందకు మార్చటంతో వారిని పార్లమెంటు సాక్షిగా తొలి ఓటమి పాలు చేసాం… మేం విసిరిన తొలి బంతికే వికెట్ కోల్పోయిన ప్రతికక్ష కూటమి, నేటి క్వార్టర్ ఫైనల్స్‌లోనే కాక ఫైనల్‌లో కూడా గెలుపు మాదేనని సందేశం ఇచ్చేసినట్లయింది!! ఆ ఊపు మీద బిల్లులపై బిల్లులను ఇరవైమూడింటిని లాగించేసుకున్నాం. మారుమూల కీకారణ్యాలలోని భూగర్భ సంపదల నుండి, దేశ రాజధాని హస్తినాపురం దాకా తిరుగులేని సమగ్ర సంరక్షణ భారమంతా రాజ్య కేంద్రం మీద ఉంటేనే కదా అభివృద్ధికి ఆస్కారం ఉండేది!

మణిపూర్‌పై పార్లమెంటులో చర్చ మొదలు కాకుండానే, దేశవ్యాపితంగా దానిపై సాగుతున్న చర్చలను ఏమార్చలేకపోతే దేశ విద్రోహశక్తుల దుష్ప్రచారాలను అరికట్టలేమని మా ప్రభూజీకి స్పష్టంగా తెలుసు. ఇప్పటికే విద్రోహ శక్తులు దాన్ని తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారు. అందుకే మరొకసారి సీన్ కట్ చేశాం. హర్యానాలోని మేవాటి జిల్లా నూహ్ పట్టణంలో ‘బ్రిజ్ మండల్ జలాభిషేక మహాయాత్ర‘ ప్రారంభించి చుట్టు పక్కల రాష్ట్రాల నుండి కూడా మా భక్తులను కర్రలు, కత్తులతో తరలించాం. 21 జిల్లాల హర్యానా రాష్ట్రంలో 7% కూడా లేని ముస్లింలు, ఈ ఒక్క మేవాటి జిల్లాలోనే నూటికి 80 మంది దాకా ఉంటే దేశానికి ఎంత ప్రమాదం! వారిని ఎలా భరించగలం?మేవాటీలు హిందూ సంప్రదాయాలను పాటించే ఆచారాలు ఉన్నవారే కావచ్చు. 700 ఏళ్లుగా తాము కూడా రాజపుత్రులమేనని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. దేశ విభజన కాలంలో కొందరు పాకిస్తాన్ పారిపోయి,తరతరాల తమ మేవాటి జీవనాన్ని మర్చిపోలేక తిరిగి భారత దేశం వచ్చేసి కూడా ఉండొచ్చు. అయినా వారితో పాటు హిందువులంతా మత సామరస్యంతో జీవిస్తుంటే, దాన్ని ఇంకా కొనసాగనిస్తే ఇక మా పాలనకు అర్థమేముంది?

అందుకే మణిపూర్ బదులు, హర్యానా రాష్ట్రంలోని దేశ విచ్ఛిన్నకుల దౌర్జన్యాల గురించి చర్చించుకునేటట్లు రంగా న్ని సిద్ధం చేసి పెట్టాం. సమయం చూసుకొని మేవాటి ముస్లింలకు, వారి నివాసాలకు డబుల్ ఇంజిన్ బుల్డోజర్లతో బుద్ధి వచ్చేటట్లు చేసాం.
ఇలాంటివన్నీ ఆకస్మికంగా తెరపైకి వచ్చినట్లు దేశ ప్రజలు నమ్మాలి. మేము వివిధ సున్నిత ప్రాంతాలను ఎంచుకుని ముందే రంగాన్ని సిద్ధం చేసే దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవహరిస్తామని వారికి తెలియనివ్వకూడదు.సరిగా హర్యానాలో కూడా అలాగే చేసుకుంటూ వచ్చాం.19 ఏళ్ల క్రితమే గురుగావ్‌లో (దాన్ని మా ప్రభూజీ హయాంలోనే గురుగ్రామ్‌గా మార్చిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది) ఒక మసీదుని తొలగించాలని మొదలుపెట్టాం. కోర్టుల్లో న్యాయమూర్తులందరూ మన మాట వినే వారే ఉండకపోవచ్చు. మూడేళ్ల క్రితం మసీదుని అక్కడే ఉండనివ్వండి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి ఇక తప్పేదేముంది? చట్టబద్ధంగా సాధ్యం కానివన్నీ మా భజరంగీయులకు అప్పచెబుతాం. వాళ్లందరూ ఆంజనేయ ఉపాసకులు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంజనేయుని ఆవాహన చేసుకోగలిగినవారు. మూడేళ్లుగా వారితో ఉన్మాద వ్యవసాయాన్ని మొదలుపెట్టించాం. ఇప్పుడు నూహ్‌తో మొదలుపెట్టి గురుగ్రామ్‌కి విస్తరించి, బీహార్ నుండి వచ్చి మసీదులో ప్రార్థనలు చేసే ఇమామ్‌కు స్వర్గలోకప్రాప్తి కలిగించగలిగాము.

పత్రికలు, టివిలు, సోషల్ మీడియా హర్యానా గురించి చర్చోపచర్చలు సాగించినందువల్ల పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై చర్చ జరిగే నాటికి, ప్రజల సంభాషణలలో విస్తారంగా ప్రస్తావించబడిన మణిపూర్ దురంతాల తీవ్రతను బాగా పల్చన చేయగలిగాం. మణిపూర్ మీద చర్చ మొదలయ్యే సమయానికైనా మా ప్రభూజీ పార్లమెంట్‌కి వస్తారని వేయి కళ్ళతో ఎదురు చూసిన ఘమిండియా ప్రతికక్షుల ఆశలను తుంచి వేసేసరికి ఉలిక్కిపడి నెహ్రూ వంశాంకురాన్ని ముందు మాట్లాడనివ్వకుండా వెనక్కి తెచ్చారు. అయితే మాత్రం మా వాళ్ళు ఊరుకుంటారా? మణిపూర్‌లో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు గురించి గర్విష్టులు వరస పెట్టినంత మాత్రాన, భారత మాతను హత్య చేశారని, ఏకైక స్వరం లాంటి భారత్‌ను ముక్కలు చేశారని పిల్లగాంధీ ఆరోపిస్తే మాత్రం మేం లెక్క పెడతామా? సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాక ప్రతికక్షుల పాలనలోని రాష్ట్రాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను బట్టబయలు చేశాం. మా ప్రభూజీ హయాంలో మహిళలు ఎంత అభివృద్ధి సాధించారో మా వాళ్ళు లెక్కలపై లెక్కలను డొక్కలు నొప్పి పుట్టేలా ఏకరువు పెట్టారు. చర్చ అంతా రానున్న ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవంగా మార్చేశాం. మణిపూర్ పరిస్థితి నెమ్మళిస్తోందని, ప్రసంగాల మధ్యే.. మధ్యే హామీలు ఇచ్చేసాం.

ప్రతిపక్షులకు అసహనం ఎక్కువ. కాకుంటే మా ప్రభూజీ ప్రసంగంలో గంటన్నర దాకా మణిపూర్ ప్రస్తావనే రాలేదని అలిగి పార్లమెంట్ చర్చల నడుమ వాకౌట్ చేసి వెళ్ళిపోతారా!! పోండి ఏమైంది?ప్రతి ఐదు నిమిషాలకి చేతులు నొప్పి పుట్టేలా బల్లలు చరిచే మేము లేమా!! ఐదేళ్ల క్రితం 2018లో కూడా ఇలాగే అవిశ్వాస తీర్మానం పెట్టారని, కావాలంటే మళ్లీ ఐదేళ్లకు మా ప్రభూజీపై మరొక అవిశ్వాస తీర్మానం పెట్టుకోమని సవాలు చేసాం. దానితో వచ్చే ఎన్నికలలో కూడా మాదే గెలుపని, మళ్లీ మా ప్రభూజీనే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పినట్లయిపోయింది.పనిలో పనిగా మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఐదేళ్ల క్రితం మా ప్రభూజీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉంది? తోకాడిస్తూ మా ప్రభూజీ మెచ్చుకోళ్ల కొరకు వెంపర్లాడటం లేదా!! వారి నాయకుడు ఎన్‌టిఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నిజంగా భారతరత్నను మేం ఇచ్చేస్తే ఆ పురస్కారాన్ని ఆయన భార్య చేతికి ఇవ్వక తప్పని పరిస్థితి రాకుండా 100 రూపాయల నాణెం విడుదలతో ఆత్మసంతృప్తి చెందే స్థితిలోకి పడిపోలేదా? ‘కేంద్ర మిధ్య’ అన్న తెలుగు ధిక్కార నాయకుని వారసులు, కేంద్రం చుట్టూ చెక్కర్లు కొట్టే వారిగా మార్చగలిగిన మా ప్రభూజీ తడాఖా ఇప్పటికైనా గ్రహించండి. కేంద్ర ప్రభుత్వం ఎడల భయభక్తులతో మెలగండి! మా రాజకీయానికి, అదానీ, అంబానీల ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు అడ్డునిలచి మనలేరని తెలుసుకోండి!!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News