మన తెలంగాణ హైదరాబాద్ : అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని స్వస్థలానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి మేయర్ ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారా హిల్స్ నుంచి రెండవసారి కార్పొరేటర్గా గెలు పొందిన ఆమె తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మొట్ట మొదటి మహిళా మేయర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. నగరంలోని హోళిమేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
బంజారా హిల్స్లోని సుల్తాన్ ఉల్ లూమ్ కళాశాలలో ఎల్ఎల్బి, భారతీయ విద్యాభవన్లో జర్నలిజంలో పట్టా పొందారు. బాబిరెడ్డి ని వివాహాం చేసుకున్న విజయలక్ష్మి అనంతరం18 ఏళ్ల పాటు అమెరికాలో స్థిరపడ్డారు. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న నార్త్ కరోలినా డ్యూక్ విశ్వవిద్యాలయంలో కార్డియాలజీ విభాగంలో పరిశోధన సహాయకురాలుగా సేవలను అందించారు. అనంతరం 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని తిరిగి స్వదేశానికి వచ్చారు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆమె తన తండ్రి బాటలో నడిచారు. 2016లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసిన విజయలక్ష్మి బంజారాహిల్స్ కార్పొరేటర్గా గెలుపొందారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో తిరిగి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించి మేయర్గా ఎన్నికయ్యారు.