కేంద్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్
డిపాజిటర్ల ఊరటకు యత్నం
యస్ బ్యాంక్ తరువాతి పరిణామం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత లక్ష్మీ విలాస్ బ్యాంక్ను డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డిబిఐఎల్)లో విలీనం చేశారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు వారం రోజుల క్రితం చైన్నైకు చెందిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్విబి)ని 30 రోజుల మారిటోరియంలో రిజర్వ్ బ్యాంక్ ఉంచింది. తరువాత పరిస్థితిని సమీక్షించుకుని ఎల్విబిని డిబిఐఎల్లో కలిపే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆ తరువాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులకు తెలిపారు. కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఇప్పుడు తీసుకున్న విలీనం నిర్ణయంతో డిపాజిటర్ల నగదు ఉపసంహరణలు జమలు ఇతర విషయాలపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని మంత్రి వివరించారు.ఈ విలీన నిర్ణయంతో 20 లక్షలకు పైగా బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన రూ 20,000 కోట్ల వరకూ ఉన్న డిపాజిట్లకు, ఎల్విబికి చెందిన 4000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి విలేకరులకు తెలిపారు.
మంచి రికార్డు , బ్యాలెన్స్ షీటు ఉన్న బ్యాంకు సముదాయంలో దీనిని విలీనం చేసినందున ఈ బ్యాంకు ఖాతాదార్లు ఎటువంటి ఆందోళన చెందరాదని , డిపాజిట్ల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదని మంత్రి వివరించారు. సరైన మూలధనపెట్టుబడి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిస్ట ఉన్న బ్యాంకులోకి దీనినిచేర్చినందున ఖాతాదార్లు నిశ్చింతగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఎల్విబి ఆర్థిక పరిస్థితి దెబ్బతినేందుకు కారకులు అయిన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జవదేకర్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో లక్ష్మీవిలాస్ బ్యాంక్లో ఆర్థిక చిక్కులు ఆందోళనకు దారితీశాయి. దీనితో ఆర్బిఐ రంగంలోకి దిగింది. నవంబర్ 17వ తేదీన 30 రోజుల మారిటోరియం ప్రకటించింది. పాలక మండలిని సూపర్సీడ్ చేసిందంఇ.
తరువాతి క్రమంలో డిబిఎస్ ఆఫ్ సింగపూర్కు అనుబంధం అయిన డిబిఐఎల్లో ఈ బ్యాంక్ విలీనానికి నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతానికి ఈ బ్యాంకు నుంచి డిపాజిటర్లు నగదు ఉపసంహరణకు సంబంధించి రూ 25000 పరిమితిని ఆర్బిఐ విధించింది. ఖాతాదారులు తమ సేవింగ్స్ , కరెంట్ అకౌంట్స్ నుంచి ఈ మేరకే నగదు తీసుకోవల్సి ఉంటుంది. అయితే రూ 50 వేల మేరకు విలువుండే ఏదైనా వస్తువును ఈ బ్యాంకు ఖాతా డబ్బుల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది మార్చిలోనే మరో బ్యాంకు యస్ బ్యాంక్ కూడా గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంది. దీనితో దీనిని కూడా మారిటోరియంలో ఉంచారు. అప్పట్లో ఈ బ్యాంకు పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం సహాయ పథకాన్ని తీసుకువచ్చింది. దీని మేరకు ఈ బ్యాంకులోకి ప్రభుత్వ రంగ ప్రధాన బ్యాంకు అయిన ఎస్బిఐ నుంచి రూ 7250 కోట్లు వచ్చేలా చేశారు. ఈ ప్రైవేటు బ్యాంకు నుంచి 45 శాతం వాటా తీసుకునే ఏర్పాటు చేసింది.