చార్జీల పెంపుకు ఎల్ అండ్ టి ప్రతిపాదనలు
మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలోనే హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే రెండోవారం నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎల్ అండ్ టి ఛైర్మన్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చేవారం తిరిగి రానున్నట్లు , ఆయన రాగానే ఛార్జీల పెంపుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అదనంగా ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే మెట్రో నిర్వాహణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ధర రూ.10, ఉండగా గరిష్ఠ టికెట్ ధర రూ.60 గా ఉంది. గరిష్ఠ ధర రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రో ఆపరేషన్స్, మాల్స్అద్దెలు, ప్రకటనల ద్వారా ఏటా రూ. 1500 కోట్ల వరకు ఆదాయం మెట్రోకు సమకూరుతోంది.
మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీ చెల్లింపులు తదితర ఖర్చులన్నీ కలిపి రూ.2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందని హైదరాబాద్ మెట్రో వర్గాలు చెబుతున్నాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రూ.6,500 కోట్ల నష్టం వచ్చినట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. స్టేషన్లు, ప్రకటనలు, మాల్స్లో రిటైల్ స్పేస్ లీజ్తో ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవడానికి సంస్థ నిరంతర ప్రయత్నాలు చేస్తున్నా ఆశించినంతగా ఫలితాలు ఉండటం లేదు. ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతుండటం, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44 శాతం పెరగడంతో హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీల పెంపు కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ.10. గరిష్ఠంగా ఛారీలు రూ.60 ఉన్నాయి. దీనిపై ఎంత పెంచితే వినియోగదారులు భరించగలుగుతారు? ఎప్పుడు పెంచాలి? మొదట పెంచి ఆ తర్వాత తగ్గించాలా? ఇలా పలు కోణాల్లో మెట్రో సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే రూ.59తో ఉన్న హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది.
హైదరాబాద్ మెట్రో వేలాది మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ.. సులువుగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఎల్ అండ్ టి సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయి. కాగా ఈ నష్టాల నుంచి గట్టేక్కేందుకు చార్జీల పెంపుకు అనుమతి కోరుతూ నాటి ప్రభుత్వం వద్దకు వెళ్లగా అనుమతి లభించలేదని తాజాగా ఈ నష్టాలు కొనసాగుతుండటంతో మరోసారి ఛార్జీల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందితే మే రెండో వారం నుంచి మెట్రో చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంది.