Tuesday, May 7, 2024

ఒకే రోజు 10 వేల యూనిట్ల రక్తం సేకరణ

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Participating in Blood Donation Camp

సిద్దిపేట: సిఎం కెసిఆర్ పిలుపుతో అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని నియోజక వర్గాల్లో రక్త దాన శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 75 యూనిట్లు సేకరణ చేస్తున్నది. మొత్తంగా 10 వేల యూనిట్ల రక్త సేకరణ ఈ ఒక్కరోజే జరుగుతున్నదని చెప్పారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్‌బ్లడ్‌ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్‌, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం వంటివన్నీ ఉంటాయి. ఈ రక్తాన్ని కంపోనెంట్ గా వేరు చేసి అవసరమైన వారికి అందిస్తామన్నారు. అప్పుడు ఒక్కరి రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుందన్నారు. టీచింగ్ ఆసుపత్రుల నుండి అన్ని అరోగ్య కేంద్రాల్లో మా వైద్య సిబ్బంది రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేస్తున్నారు. ఈరోజు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్పగా ఉందన్న మంత్రి మనమంతా ఒక్కటే. భారతీయులం. కుల, మత, జాతి బేధాలు లేవు అని మనం చాటుతున్నామని చెెప్పారు.

ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు, పోరాటాల వల్ల నేడు మనం స్వేచ్ఛా ఊపిరి పీల్చుకున్నాం. వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. అన్నదానం చేస్తే.. ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు అన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరం. అటువంటి సందర్భంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణ దాతలు కావొచ్చు. మానవతా హృదయంతో ఎంతో మంది స్పందించి రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు. ఇంటి పనులు, ఆఫీసు పనులు, వ్యక్తిగత పనులు పక్కన పెట్టి, దూర ప్రాంతాల నుండి వచ్చి రక్తదానం చేస్తుంటారు. అలాంటి వారు ఎంతో గొప్పమనసున్నవారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

కష్ట సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి దేవుడిగా మారుతాడు. ఎప్పుడో, ఎక్కడో ఒక వ్యక్తి చేసిన రక్త దానం ఆ ప్రాణాన్ని కాపాడుతుంది. ఇలా రక్త దానం చేస్తూ ప్రాణ దాతలుగా ఉన్నవారు ఎందరో మన చుట్టూ ఉన్నారు. ప్రతి ఒక్కరికీ నా వందనాలు. మీరు అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెట్టుతుంది. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి. రక్తదానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఆరోగ్య వంతులు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. ఈరోజు మాత్రమే కాదు మీ పుట్టిన రోజులు, మీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజున రక్తదానం చేయండి. చేయించాలని కోరుతున్నాను. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News