భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
గత ఏడాది పొరపాట్లు పునరావృతం కారాదు
మంత్రి హరీష్రావు
మన తెలంగాణ/పాపన్నపేట : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు సూచించారు. శుక్రవారం ఏడుపాయలలోని హరిత రెస్టారెంట్లో జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అధ్యక్షతన ఏడుపాయల జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేసి జాతరను వైభవంగా నిర్వహించాలన్నారు.
గత ఏడాది జాతరలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, ప్రతి శాఖకు అప్పగించిన పనిని త్వరితగతిన పూర్తి చేసి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై మంత్రి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడుపాయల ఆలయానికి ఆరు ఎకరాల అటవీ శాఖ భూమిని ఇవ్వడం జరిగిందని, మరో 12 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూముల కోసం 95లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఏమిటని జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణీని మంత్రి నిలదీశారు. దీంతో అమె వివరణ ఇస్తూ కాళేశ్వరం భూ నిర్వాసితులకు చెల్లించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతిపాదనలను సరి చేయాలని మంత్రి ఆదేశించారు.
రోడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధంపై మంత్రి సూచనలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు ఇన్చార్జి డిఎస్పి కిరణ్కుమార్ తెలిపారు. ఏడుపాయల్లో ఔట్పోస్టు ఏర్పాటు ఏమైందని మంత్రి అడగడంతో అనుమతి రాలేదని సమాధానం ఇచ్చారు. తాను ఇన్స్పెక్టర్ జనరల్తో మాట్లాడుతానని మంత్రి తెలిపారు. జాతరలో బెల్టు షాపులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆబ్కారీ సీఐ గోపాల్ను ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్కుమార్, ఈవో సార శ్రీనివాస్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, పాపన్నపేట ఎంపిపి చందన ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు.
Minister Harish Rao Review meeting on Edupayala jatara