Monday, April 29, 2024

బౌద్ధ ఆధ్యాత్మిక సావనీర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో బుద్ధిజం పరిరక్షణకు, బౌద్ద కేంద్రాల అభివృద్ధి పై రూపొందించిన బౌద్ధ ఆధ్యాత్మిక సావనీర్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా జెటవనారమయ -అనురాధపురంలో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రంను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి బౌద్ధ కేంద్రాన్ని ఆయన సునిషితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మికవేత్త నాగార్జునుడు నడియాడిన కేంద్రమైన విజయపురి (నేటి నాగార్జునసాగర్) లో సుమారు 200 ఎకరాలలో 100 కోట్ల రూపాయల నిధులతో బుద్ధ వనంను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారన్నారు. బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధం కొలువైందని మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణలో బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలను బౌద్ధ సంస్కృతి పరిరక్షణ,బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి పై రూపొందించిన సావనీర్ ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల, బాదంకుర్తి, ఫణిగిరి, నేలకొండపల్లి లాంటి ప్రాంతాలలో బుద్ధిజం ఎంతో వైభవాన్ని చాటిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న బుద్ధిజం కేంద్రాలను పరిరక్షిస్తూ వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా , బౌద్ధ విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకులు నవీన్ గుణవర్దనే , డాక్టర్ శివనాగిరెడ్డి, ప్రముఖ నటులు గగన్ మాలిక్, డా. మౌనిక సిరివర్ధన, శ్రీలంక దేశ బౌద్ధ ఆధ్యాత్మికవేత్తలు , శ్రీలంక దేశ ఉన్నతాధికారులు, పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News