Sunday, May 5, 2024

200 యూనిట్ల లోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

సిరికొండ: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకు బిల్లులు వచ్చిన వారెవరూ బిల్లు కట్టవద్దని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ మండలం, నర్సింగ్‌పల్లికి చెందిన పిఎసిఎస్ మాజీ చైర్మన్, మాజీ జడ్‌పిటిసి అయిత ఫిలిప్ సుజ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం వారి నివాసంలో క్రిస్మస్ విందుకు ఆమె హాజరయ్యారు. అదేవిధంగా సిరికొండ మండల పర్యటనకు వచ్చిన ఆమె జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయిచరణ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధితో అలోచించడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడంలో తాత్సారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత తమ ప్రభుత్వం 44 లక్షల మందికి ఆసరా పెన్షన్ల్లు ప్రతినెల పంపిణీ చేసిందని, వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కొత్త సంవత్సరం నుండి రూ.4 వేలకు పెంచి వెంటనే డబ్బులు అందజేయాలని కోరారు.
ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరిన పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అన్నారు.

కాబట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులను త్వరగా స్వీకరించి కార్డులు జారీ చేసి పథకాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమ చేయలేదన్న చర్చ గ్రామాల్లో జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న చర్చ కూడా జరుగుతోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News