Sunday, April 28, 2024

దళితుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన బిఆర్‌ఎస్ సర్కార్:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డిపేట : దళితుల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ ఎంతో కృషి చేసిందని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అణగారిన వర్గాలకు ఆర్థిక చేయూతన కల్పించేందుకు ప్రయోగాత్మకంగా బిఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితబంధు పథకం ప్రవేశపెట్టారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, పదిర గ్రామంలో దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వంద శాతం అమలు చేసినట్లు పేర్కొన్నారు.

దళితబంధు పథకం దేశంలో ప్రశంసలు పొందిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆరుగురు లబ్ధ్దిదారులు సిరిసిల్ల=కామారెడ్డి ప్రధాన రహదారి, అర్బన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసుకున్న పెట్రోల్, డీజిల్ బంక్‌ను బుధవారం జడ్‌పి చైర్‌పర్సన్ అరుణ, ఎంపిపి పిల్లి రేణుక, జడ్‌పిటిసి చీటి లక్ష్మణ్‌రావు తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వలన ఈ బంక్ ప్రారంభం ఆగిపోయిందని అన్నారు. దుమాల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన రైస్ మిల్లు విజయవంతంగా నడుస్తోందని ప్రశంసించారు. ప్రధాన రహదారి పక్కనే బంక్ ఉండటం వలన విజయవంతంగా నడుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గానికి దళితబంధును అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు పక్కన పెడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాచర్ల గొల్లపల్లిలో సోషల్ మీడియా కార్యకర్త సాయిగౌడ్ పెళ్ళి వేడుకలకు ఆయన హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి, కొడుకు కోడలిని ఆశీర్వదించారు. హరిదాస్ నగర్‌లో జడ్‌పిటిసి లక్ష్మణ్‌రావు ఇంటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల గృహ ప్రవేశాలు, పెళ్లిల్లు, శుభకార్యాలు చేసుకున్న పలువురి ఇండ్లకు వెళ్ల్లి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల పర్యటనకు వెళ్ల్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్‌పి కోఆప్షన్ మెంబర్ చాంద్ పాష, ఎంపిటిసిలు అనసూయ నర్సింహులు, నాగరాణి పరుశ రాములు గౌడ్, ల్యాగల శ్రీనివాస రెడ్డి, ఇల్లందుల గీతాంజలి, ప్యాక్స్ డైరెక్టర్ నేవూరి వెంకట నర్సింహ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి, పలువురు అభిమానలు, కార్యకర్తలు నాయకులు పాల్గ్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News