Saturday, April 27, 2024

గ్రామాల్లో నిధులన్నీ మోదీ సర్కార్‌వే :బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. బుధవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక అధికార శిబిరంలో ఆయన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, చేతికర్రలు, వినికిడి యంత్రాలు సహా 18 రకాల ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర నిధులతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటే ఆనాడు అధికారులు రాకుండా ఒత్తిడి చేసేవారని అన్నారు. తాజాగా ఎడిఐపి, ఆర్‌వివై (రాష్ట్రీయ వయోశ్రీ యోజన) పథకం కింద కరీంనగర్ జిల్లాలో 731 మంది దివ్యాంగులకు కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ట్రైసైకిళ్ల పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 433 మం దికి, హుజూరాబాద్ అసెంబ్లీ పరిధిలో 297 మందికి ట్రై సైకిల్స్ అందించామని తెలిపారు. గతేడాది వేములవాడలో ప్రత్యేక శిబిరం నిర్వహించి పెద్ద ఎత్తున పరికరాలను పంపిణీ చేశామని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం, గుడ్డు సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు పౌష్టికాహారం, గడ్లు, పాలు సహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తూ గర్భిణులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగేలా చేస్తోందని అన్నారు. వృద్ధులకు, దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపకరణాలు అందనివాళ్లు బాధపడాల్సిన పనిలేదని,

ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి అతి త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. మూడుసార్లు తానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. గతంలో అధికారులు కేంద్రం అమలు చేసే సంక్షేమ కార్య క్రమాల్లో పాల్గొనేవారు కాదని అన్నారు. అధికారులకు హ్యాట్సాఫ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను భవిష్యత్తులోనూ స్వేచ్ఛగా పనిచేయనివ్వాలని, లేనిపక్షంలో బిఆర్‌ఎస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి, అనిల్ కుశాల్ తోపాటు దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News