మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను కాంక్షిస్తున్న సిఎం కెసిఆర్ సంకల్పానికి మద్దతుగా ఒకేరోజు కోటి మొక్కలను నాటేందుకు ఎంపి సంతోశ్ కుమార్ ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమ పోస్టర్ను ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఎంపి సంతోశ్ కుమార్తో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత మాట్లాడుతూ, తెలంగాణలో పచ్చదనాన్ని మరింత పెంచాలనే సిఎం కెసిఆర్ ఆశయానికి అనుగుణంగా, ప్రతి తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. నాటిన మొక్కలను వదిలేయకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే సిఎం కెసిఆర్కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని పేర్కొన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపి సంతోశ్ కుమార్ను ఎంఎల్సి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిశోర్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి, టిఆర్ఎస్ నాయకుడు దాదాన్నగారి సందీప్ పాల్గొన్నారు.