Sunday, April 28, 2024

ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భోపాల్ నుంచి రాణి కమలాపతి రైల్వేస్టేషన్ నుంచి రెండు రైళ్లకు పచ్చజెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోరా, భోపాల్ నుంచి జబల్‌పూర్ వెళ్లే రెండు వందేభారత్ రైళ్లకు మోడీ పచ్చజెండా ఊపారు.

మడ్‌గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగళూరు, హతియా నుంచి పాట్నా వెళ్లే మిగతా మూడు రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా మధ్య ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో తెలిపారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ , రాష్ట్రముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్,కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం ఉదయం భోపాల్ ఎయిర్‌పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌కు ప్రధాని హెలికాప్టర్‌లో రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన స్టేషన్‌కు చేరుకున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News