Sunday, April 28, 2024

నిర్ణయాధికారాల్లో భారత్ వెలి ఎంతకాలం?

- Advertisement -
- Advertisement -
Modi strong message to the General Assembly

 

ఐరాస వాస్తవిక సంస్కరణలు తక్షణావసరం
భద్రతా మండలిలో భారత్ చోటు కీలకం
జనరల్ అసెంబ్లీకి ప్రధాని మోడీ ఘాటు సందేశం

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి కీలక విధాన నిర్ణయక వ్యవస్థలలో భారత్‌ను ఎంతకాలమని దూరం పెడుతారని ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. నిర్ణయాధికారం లేకుండా భారత్‌ను సందిగ్థావస్థలో పెడుతారని ప్రశ్నించారు. ఇప్పుడు సాగుతోన్న ఐరాస 75వ వార్షిక సర్వప్రతినిధి సభ నుద్ధేశించి శనివారం భారత ప్రధాని వీడియో సందేశం ద్వారా స్పందించారు. సంస్కరణల ప్రక్రియను సంస్థ మరింత వేగవంతం చేయాలని ప్రధాని డిమాండ్ చేశారు. సంస్కరణలు పూర్తిగా సమకాలీన వాస్తవికతల కోణంలో ఉండాలని సూచించారు. వాస్తవికతకు తావులేకుండా, కార్యాచరణకు వెళ్లకుండా ఎంతకాలం సాగదీస్తారని నిలదీశారు. భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం అత్యవసరం అని తాము దీనిని పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు. నిర్ణయాల ఖరారు , విధానాల రూపకల్పనలో కీలకమైన మండలి వంటి వాటికి భారత్‌ను ఎంతకాలం దూరం పెట్టాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రపంచ దేశాల ప్రాతినిధ్యపు సంస్థలో ఇప్పటికైనా తగు సంస్కరణల ప్రక్రియ అవసరం అని ప్రధాని స్పష్టం చేశారు. అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలకు సంబంధించి భారత్‌ను ఇంకా ఎంతకాలం వెలివేసినట్లుగా ఉంచుతారని ప్రశ్నించారు. సంస్కరణల ప్రక్రియ ఎంతకాలం చర్చల దశలోనే ఉంటుంది? దీనికి ఓ నిర్థిష్టమైన సరైన ముగింపు దక్కుతుందా? అని తమ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.సంస్కరణలు శీఘ్రంగా పూర్తి కావాలని చిరకాలంగా తమ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికీ భారత్ పట్ల చిన్నచూపు ప్రదర్శించడం అనుచితమేనని, ఈ ధోరణి ఎప్పటికీ ముగుస్తుందని ప్రశ్నించారు.చర్చలు జరుగుతున్నాయని అంటున్నారని, ఏకాభిప్రాయ సాధన అవసరం అంటున్నారని,అయితే కనీసం ఇప్పటికీ సంప్రదింపుల పత్రం లేదా సంస్కరణల విషయంలో పురోగతిని తెలిపే ప్రక్రియ ఏదీ లేదన్నారు.

కోవిడ్‌పై పోరుకు మీ నాయకత్వమేదీ ?

ఈ వేదిక నుంచే ప్రధాని మోడీ కోవిడ్ 19 మహమ్మారిపై ఐరాస పోరు తీరుతెన్నులను నిలదీశారు. గత 8 లేదా 9 నెలలుగా ప్రపంచం అంతా కూడా ఈ కరోనావైరస్‌తో పోరాడుతోందని, ఇది నిజానికి ఓ ఉమ్మడిపోరుగానే ఉందని, కానీ ఈ దిశలో ఐరాస పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రపంచ సంస్థ ఈ అత్యంత ప్రధానమైన సమస్యపై ఏ మేరకు సమర్థవంతంగా వ్యవహరిస్తోందనేది వెల్లడికావల్సి ఉందన్నారు. ప్రస్తుత ఐరాస జనరల్ అసెంబ్లీ కరోనా వైరస్ నేపథ్యంలో సాగుతోంది. దీనిని పూర్తిగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రధాని చేసిన ప్రసంగాన్ని ముందుగా రికార్డు చేసి, దీనిని జనరల్ అసెంబ్లీ హాల్‌లో విన్పించారు వర్తమాన వాస్తవికతలతో నిమిత్తం లేకుండా ఐరాస సాగుతోందని విమర్శించారు. కోవిడ్ 19 వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచాన్ని కబళించిందని, ప్రపంచ దేశాలన్ని సంఘటితంగానే పోరు సల్పుతూ ఉంటే ఐరాస ఇందులో ఏం పాత్ర పోషిస్తోందని ప్రశ్నించారు.

కరోనాపై పోరువిషయంలో ఐరాస నాయకత్వం వహించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. . మహమ్మారి ఆటకట్టు దిశలో ఐరాస తొలిదశలో సరైన విధంగా వ్యవహరించలేదనే విమర్శలు వచ్చిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. జనవరి చివరిలోనే కరోనా సంక్రమిస్తే ఐరాస చిట్టచివరికి జులైలో ఈ మహమ్మారి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచదేశాలు అన్ని ఈ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముందుగా తమ పాత వైరాలను నిలిపివేయాలని కోరుతూ తీర్మానం వెలువరించింది. అయితే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ అసంఖ్యాకులను బలి గొంది. సంస్కరణలు కేవలం ఊహాత్మకం అయితేలాభం లేదని, ఇవి అమలు దిశకు చేరాల్సి ఉందని, ఐరాస విశిష్ట లక్షణాల కోణంలో వీటిని అమలులోకి తేవడం ఇప్పటి అవసరం అని ప్రధాని స్పష్టం చేశారు.

పలు విషయాలలో ఇండియా సమున్నత పాత్ర

ఐరాస నిర్ధేశిత అంశాలలో భారతదేశం ఎంతోకాలంగా విశిష్ట పాత్ర పోషిస్తోందని ప్రధాని గుర్తు చేశారు. ఐరాస శాంతిదళాలలో భారత్ ప్రాతినిధ్యం ఎంతో ఉంది ఇప్పుడు కరోనా వైరస్ దశలో భారతదేశ ఔషధ పరిశ్రమ నుంచి నిత్యావసర ఔషధాలు దాదాపు 150 దేశాలకు సకాలంలో చేరాయని తెలిపారు. అనేక విధాలుగా ఐరాస సేవలకు ఆసరా అందిస్తోన్న తమ దేశాన్ని ఈ విధంగా ఎంతకాలం దూరందూరంగా ఉంచుతారని నిలదీశారు. .కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, సరైన పంపిణీ విషయంలో ప్రపంచం అంతా భారత్ వైపే ఎదురుచూస్తోందని ప్రధాని ఈ వేదిక ప్రసంగంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News