Tuesday, April 30, 2024

మెదక్ బిషప్ పై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

 

నా ప్రాణానికి హాని ఉంది: బిషప్ సాల్మాన్ రాజ్
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి బిషప్ ఎసి సాల్మాన్‌రాజ్‌పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. ఈ విషయాన్ని బిషప్ సాల్మాన్ రాజ్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి నేరుగా ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం బిషప్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాల్మాన్‌రాజ్ మాట్లాడుతూ… నా ప్రాణానికి హాని ఉందన్నారు. ఆదివారం ఉదయం చర్చిలో జరిగే ప్రత్యేక ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన తనను దాదాపు 30 మంది కత్తులతో వెంబడించి తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టారన్నారు.

దీన్ని గుర్తించిన తాను కేకలు వేయడంతో చర్చిలో ఉన్న పాస్టర్లు తదితరులు వెంటనే అతని వద్దకు చేరుకోగా దుండగులు పారిపోయినట్లు తెలిపారు. దీంతో తనకు తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు. తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిలో దాదాపు 18 మందిని తాను గుర్తించినట్లు తెలియజేస్తూ వారి పేర్లను వెల్లడించారు. అయితే ఈ హత్యాయత్నానికి గల కారణాలపై ఆయన వెల్లడిస్తూ గత నెల అక్టోబర్ 1వ తేదీన జరిగిన చర్చి కమిటీ ఎన్నికల్లో ఒక వర్గంలో ఏడుగురు గెలుపొందగా, మరొక వర్గంలో 11మంది గెలుపొందారు. మెజార్టీ సభ్యులు గెలిచిన ప్యానలే చర్చి కమిటీ వ్యవహార నిర్వాహణ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే బిషప్‌కు అధికార స్థానానికి మరో 9మంది సభ్యులను నేరుగా కమిటీలో చేర్చే హక్కులుంటాయి. ఈ సభ్యులను ఏ ప్యానల్‌కు అయిన బిషప్ మద్దతు ఇచ్చుకోవచ్చు. ఈ తరుణంలో ఏడుగురు గెలిచిన ప్యానల్‌కు మద్దతు ఇవ్వడంతోనే ప్రత్యర్థి వర్గం తనను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి వారి వల్ల చర్చి ప్రతిష్టకే భంగం వాటిల్లుతుందని అటువంటి వారిపట్ల మున్ముందు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాల్మన్‌రాజ్ అన్నారు. వీరికి చట్టపరంగా శిక్ష పడేలా న్యాయపోరాటం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News