Tuesday, April 30, 2024

మైసూరు దశరా ఉత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మైసూరు: సంప్రదాయానికి, వైభవానికి ప్రతీకగా నిలిచే చరిత్రాత్మక మైసూరు దశరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమైనాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు హంసలేఖ పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ప్రారంభించారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్, ఇతర మంత్రులు, ఎంపి ప్రతాప సింహ, ఎంఎల్‌ఎలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం దశరా ఉత్సవాలను నిర్వహిస్తోందని, అయితే ఈ ఏడాది రాష్ట్రంలో కరవు దృష్టా నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని సిద్ధరామయ్య చెప్పారు.

రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే దశరా ఉత్సవాలను తిలకించడానికి ప్రపంచం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రభుత్వం సంస్కృతీ సంప్రదాయాలు, భాష, రాష్ట్రం సాధించిన అభివృద్ధిని తెలియజేస్తుందన్నారు. ఉత్సవాలు ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో కలిసి చాముండేశ్వరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు జరిగే పది రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విజయదశమి రోజు జరిగే జంబూ సవారిని తిలకించడానికి లక్షల సంఖ్యలో జనం వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News