Friday, April 26, 2024

తెలంగాణపై ఎందుకీ వివక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపైనా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, తెలంగాణకు న్యాయం చేయాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రేపటి నుంచి జరగనున్న శీతాకాల సమావేశాలను పురస్కరించుకొని మంగళవారం న్యూఢిల్లీలో స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఎంపీ నామ టీఆర్ఎస్ లోక్ సభా పక్ష హోదాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ.. తెలంగాణాకు సంబంధించి ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అన్ని విభజన అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. పైగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుండడం పట్ల మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం వ్యవహరించడం పట్ల నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లయినా ఏ ఒక్క విభజన హామీ అమలు చేయక పోవడం పట్ల నామ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు తెలంగాణపై ఈ వివక్ష అని ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్శిటీ, ఐఐఎం స్థాపన తదితర హామీలు ఏమయ్యాయని ప్రశించారు.

వీటన్నింటిపై ఈ సమావేశాల్లోనే చర్చించి, తెలంగాణా న్యాయం చేయాలని నామ కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణాలు పొందే విషయంలో కూడా లేనిపోని ఆంక్షలు విధించి, వివక్ష చూపిస్తున్నారని అన్నారు. ఈ అంశంపైనా కూడా చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలను ఆతలాకుతలం చేస్తున్నాయని, ఇందుకు సంబంధించి ప్రత్యేక చర్చ జరపాలన్నారు.

ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, కుల గణన, రిజర్వేషన్లు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. కేంద్రం కొర్రీలతో తెలంగాణ ఆర్ధికంగా నష్ట పోవాల్సి వస్తుందన్నారు. కేంద్రం మొకలొడ్డడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని నామ పేర్కొన్నారు. అన్ని అంశాలపైన చర్చించి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని నామ కేంద్రాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News