Wednesday, May 8, 2024

డ్రాగన్ హెచ్చరికలు బేఖాతరు

- Advertisement -
- Advertisement -

Nancy Pelosi lands in Taiwan

తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసి
అమెరికా, చైనాల మధ్య మరింత పెరిగిన ఉద్రిక్తతలు

తైపీ: తైవాన్ విషయంలో అమెరికా, చైనా దేశాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డ్రాగన్ హెచ్చరించిన నేపథ్యంలో పెలోసి మంగళవారం రాత్రి తైవాన్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. పెలోసి ప్రయాణిస్తున్న విమానానికి తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భూభాగంగా చైనా చెప్పుకొంటున్న తైవాన్‌లో అమెరికాకు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి పర్యటించడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నాన్సీ పెలోసి తైపీ పర్యటన విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా తేల్చి చెప్పడంతో చైనా సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి దాటినట్లుగా స్థానికంగా వార్తలు వెలువడుతునన్నాయి. పెలోసి తైవాన్ పర్యటనపై చైనా మొదటినుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పెలోసి గనుక తైవాన్‌లో అడుగగుపెడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని డ్రాగన్ ఇప్పటికే హెచ్చరించింది.

తాజా పరిణామాలతో అమెరికాచైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనాకు చెందిన ఎస్‌యు35 యుద్ధ విమానాలు తైవాన్ స్ట్రెయిట్ దాటి వెళ్లినట్లు సిజిటిఎస్ పేర్కొంది. మరో వైపు చైనా హెచ్చరికల నేపథ్యంలో నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనకు ముందే నాలుగు యుద్ధ నౌకలను తైపీ సమీపంలోని సముద్ర జలాల్లో అమెరికా మోహరించినట్లు తెలుస్తోంది. కాగా తన పర్యటన తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతుందని పెలోసి ట్వీట్ చేశారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవలసి వస్తోన్న ప్రస్తుత తరుణంలో తైవాన్‌లోని 23 మిలియన్ల ప్రజలకు అమెరికా సంఘీభావం ఇప్పుడు ముఖ్యమని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా పెలోసి తైవాన్ పర్యటనకు ప్రతిగా సైనిక చర్యలు చేపడతామని చైనా హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News