23 వారాల గరిష్ఠం
ఇంకా కోలుకోని కార్మిక విపణి ః ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐఇ) తాజా నివేదికలో ఇది స్పష్టమైంది. ఈ నెల 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత 10 శాతానికి చేరింది. 23 వారాల గరిష్ఠమిది. కొన్ని నెలలుగా దేశంలోని నిరుద్యోగిత 68 శాతంగా నమోదవుతోంది. ఈ వారం పట్టణ నిరుద్యోగిత 11.62 శాతంగా నమోదైంది. గత వారం ఇది 8.15శాతంగా నమోదైంది. గ్రామీణ నిరుద్యోగిత 9.11శాతంగా నమోదైంది. గతవారం ఇది 8.56 శాతం.
దేశంలో కరోనా విజృంభణ సమయంలో నిరుద్యోగిత అధికంగా నమోదైంది. ఈ ఏడాది జూన్ 14న నిరుద్యోగిత 11.63
శాతం. కాగా, ఆ సమయంలో పట్టణ నిరుద్యోగిత 13.1 శాతం, గ్రామీణ నిరుద్యోగం 10.96 శాతం. జూన్ 21న నిరుద్యోగిత 8.48 శాతం, ఆ సమయంలో పట్టణ నిరుద్యోగిత 11.19 శాతం. ఇది తాజాగా నమోదైన పట్టణ నిరుద్యోగిత
11.62 శాతంకన్నా తక్కువన్నది గమనార్హం.
నిరుద్యోగిత పెరగడం కార్మిక విపణిలో డిమాండ్ తగ్గడానికి సూచిక అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సిఎంఐఇ డేటా ప్రకారం నవంబర్లో కార్మిక భాగస్వామ్యం రేట్(ఎల్పిఆర్) 40.03 శాతం కాగా, అక్టోబర్, సెప్టెంబర్లో 40.66 శాతం. జనవరిలో నమోదైన ఎల్పిఆర్ 42.9 శాతంకన్నా ఇది చాలా తక్కువ. 2019 ఆగస్టునవంబర్ మధ్య ఎల్పిఆర్ 43.02 నుంచి 42.3 శాతం వరకు నమోదైంది. ఇప్పుడు ఎల్పిఆర్ క్రమంగా పెరుగుతోందని, కొవిడ్ ప్రారంభానికి ముందునాటి పరిస్థితి తిరిగి నెలకొంటున్నా, ఆస్థాయిలో ఉద్యోగాలు కల్పించేస్థాయికి మార్కెట్ చేరుకోలేదని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రొఫెసర్ అరూప్మిత్రా అన్నారు.