Saturday, July 27, 2024

పల్లెటూరి అమ్మాయి బుజ్జిగా కనిపిస్తా:నేహా శెట్టి

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో ఈనెల 31వ తేదీన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అందాల తార నేహా శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర బుజ్జిగా ఈ సినిమాలో కనిపిస్తా. అందంగా కనిపిస్తూనే, ధృడంగా ఉండే పాత్ర ఇది. ట్రైలర్ లో గమనిస్తే మిగతా పాత్రలతో పోలిస్తే బుజ్జి పాత్ర భిన్నంగా ఉంటుంది.

ట్రైలర్ లో మీకు అందంగా, సౌమ్యంగా కనిపిస్తుంది. కానీ చాలా శక్తిగల మహిళ పాత్ర ఇది. సినిమాలో ఈ పాత్రకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. ఒకమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు. 90 లలో రత్న అనే పాత్రతో పాటు రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఇది ఒక జీవిత కథ. ప్రచార చిత్రాలు చూసి యాక్షన్ మాత్రమే ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు. రొమాన్స్, కామెడీ, డ్రామా అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా ఉంటుంది. విశ్వక్ సేన్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇక అంజలి, నా కాంబినేషన్‌లో ఎక్కువగా సన్నివేశాలు లేవు. అనుభవం గల నటి అంజలి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు కృష్ణ చైతన్య కథ రాసిన విధానం, సినిమాగా తెరకెక్కించిన విధానం అద్భుతం. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ప్రారంభమవుతుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News