ఎటువంటి సడలింపు లేకుండా, పట్టు వీడకుండా ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై బీకర వైమానిక దాడులు సాగించింది. ఇరాన్లోని లోతట్టు ప్రాంతంలోని అరాక్ భారీ జల రియాక్టర్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ప్రాంతంలో దాడులు జరుగుతాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఓ వైపు ప్రకటనలు వెలువరించారు. వెంటనే భారీ స్థాయిలో ఈ హెవీ వాటర్ ప్లాంట్పై బాంబులు కురిపించారు. దీనితో పాటు ఇరాన్ అణు కార్యక్రమం సాగుతోన్న ఓ స్థావరంపై కూడా విస్తృత స్థాయిలో విమానాలతో బాంబులు కురిపించారు. నిర్ణీత లక్షాలను ఎంచుకుని వంద వరకూ శక్తివంతమైన బాంబులు ఇతర ఆయుధాలను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్ ప్రయోగించింది. టెహ్రాన్కు నైరుతి దిశలో అరాక్ హెవీ వాటర్ ప్లాంట్ ఉంది. ఇది ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలలో ప్రధాన స్థావరంగా ఉందని ఇజ్రాయెల్ పసికట్టింది.
ఈ దశలోనే దీనిని టార్గెట్గా చేసుకుని దాడులకు దిగింది. శుద్ధి చేసిన యురేనియం వంటి కీలక ముడిపదార్థాల అవసరం లేకుండానే తమ అణుబాంబును తయారు చేసుకునేందుకు ఇరాన్కు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ముందుగా స్థానికులను హెచ్చరించడం తరువాతి క్రమంలో పలు క్షిపణి తయారీ వ్యవస్థలపై, అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు సాగాయి. ఈ భారీ స్థాయి దాడులకు ఇజ్రాయెల్కు చెందిన 40 వరకూ ఫైటర్ జెట్ విమానాలను రంగంలోకి దింపారని ఇజ్రాయెల్ సైనిక విభాగం (ఐడిఎఫ్) ఓ ప్రకటన వెలువరించింది. నటాంజ్ అణు కేంద్రంతో సరఫరాల లింక్ ఉన్న ఓ స్థావరంపై కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు దాడికి దిగింది. అన్నింటికి మించి ఇప్పుడు అరాక్ ప్రాంతంలోని ఐఆర్ 40 హెవీ వాటర్ రియాక్టర్పై బాంబుల దాడి కీలక పరిణామం అయింది. అరాక్ నగర శివార్లలో ఇది ఉంది. ఈ కేంద్రంలోనే ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతోందనే వార్తల దశలో అప్పట్లో ఈ కేంద్రంలో అంతర్జాతీయ అణు సంస్థ నిశిత తనిఖీలు జరిగాయి.
ఇప్పటికీ పర్యవేక్షణ సాగుతోంది. అయితే ఇప్పటికీ ఇక్కడ అణు బాంబు తయారీ పదార్థాల తయారీ జరుగుతోందని వెల్లడైంది. దాడుల తరువాత ఐడిఎప్ కీలక ప్రకటన వెలువరించింది. ఇప్పుడు అరాక్ స్థావరం ధ్వంసం అయిందని, ఇక్కడ ఎటువంటి ఉత్పత్తి లేకుండా పోయిందని వివరించారు. అయితే ఇక్కడ అణుతయారీ సంబంధిత న్లూటోనియం ఉత్పత్తి ఏమి జరగడం లేదని ఇరాన్ చెపుతోంది. ఈ వాదనను ఇజ్రాయెల్ ఖండించింది. ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడిని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) ధృవీకరించింది. అయితే ఎటువంటి రేడియోధార్మిక దుష్ప్రభావం ఏదీ లేదని తెలిపారు. ఇప్పటికే ఇరాన్లోని నటాంజ్ అణు కేంద్రాన్ని దెబ్బతీసిన ఇజ్రాయెల్ ఇప్పుడు రెండోటార్గెట్గా అరాన్ స్థావరాన్ని ఎంచుకుని దాడులకు దిగింది.
అయితే ఈ దాడి పట్ల ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. అయితే తమ దేశ ఆత్మరక్షణకు, ఇరాన్ నుంచి ఇక ఎటువంటి అణు దాడులు ఉండకుండా చేసుకునేందుకు తాము ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట చర్య చేపట్టిన విషయాన్ని, ఇది కొనసాగుతున్న విషయాన్ని ఇజ్రాయెల్ సేనలు వెల్లడించాయి.