Sunday, April 28, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -
10 కౌంటర్‌లతో ప్రయాణికులకు అందుబాటులోకి

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ప్రారంభమయ్యిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా కొత్త తాత్కాలిక బుకింగ్ ఆఫీస్ 10 కౌంటర్లతో మంగళవారం నుంచి పని చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. పాత జనరల్ టిక్కెట్ బుకింగ్ కార్యాలయం 14 జూన్ 2023 అర్ధరాత్రి వరకు పని చేస్తుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా స్టేషన్ భవనానికి ఉత్తరం వైపున ఉన్న కొత్త తాత్కాలిక బుకింగ్ ఆఫీస్‌ను ప్రారంభించడంతో మరో ప్రధాన అడుగు ముందుకు పడిందని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులను చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుత స్టేషన్ భవనానికి ఉత్తరం వైపున ఆధునిక నిర్మాణం, సౌందర్య ముఖభాగంతో కూడిన కొత్త స్టేషన్ భవనం అందుబాటులోకి రానుంది. దీంతోపాటు, స్టేషన్ భవనానికి ఉత్తరం వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, టూ-లెవల్ స్కై కాన్కోర్స్‌ను నిర్మిస్తున్నారు. కొత్త స్టేషన్ భవన నిర్మాణ సమయంలో ప్రయాణికుల సేవలు ప్రభావితం కాకుండా, కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయాన్ని నిర్మించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

24 గంటల పాటు వర్కింగ్
కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ఎగ్జిట్ గేట్ సమీపంలో అంటే పార్శిల్ కార్యాలయానికి సమీపంలో స్టేషన్ భవనం ఉత్తరం వైపున గేట్ నంబర్ 5 వద్ద నిర్మించినట్టు అధికారులు పేర్కొన్నారు. 10 కౌంటర్లు కలిగిన తాత్కాలిక బుకింగ్ కార్యాలయం స్టేషన్ భవనంలో గేట్ నెం 3 కి దగ్గరగా ప్రస్తుతo పనిచేస్తున్న 9 కౌంటర్ల బదులుగా ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. ఈ కొత్త తాత్కాలిక బుకింగ్ ఆఫీస్ మంగళవారం నుంచి 24 గంటలు పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయం ప్రయాణికులకు అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) టిక్కెట్‌ల కొనుగోలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, సీజన్ టిక్కెట్‌ల పునరుద్ధరణ అలాగే విచారణ సౌకర్యం వంటి అన్ని సౌకర్యాలను అందిస్తుంది. అదనంగా, ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందించడానికి, ఇప్పటికే 04 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లు (ఏటివియుంలు) ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా: జిఎం
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. 36 నెలల కాల వ్యవధిలో పనులు పూర్తి చేసేందుకు ప్రతి దశలోనూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయంతో పాటు తమ మొబైల్‌లోని యుటిఎస్ యాప్ నుంచి టిక్కెట్ల సేవలను పొందేందుకు రైల్వే ప్రయాణికులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News