దారుణంగా విఫలమైన టీమిండియా బ్యాట్స్మెన్
సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
దుబాయి: ఐసిసి టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఇక్కడ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయింది. సెమీ ఫైనల్లో స్థానం కోసం తప్పకుండా గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. దీంతో వరసగా రెండో ఓటమిని మూటకట్టుకుని సెమీస్కు అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఒక వేళ స్కాట్లాండ్, నమీబియా చేతుల్లో పాకిస్థాన్ కానీ, న్యూజిలాండ్ కానీ ఓడితే అప్పుడు భారత్ ఆశలు సజీవంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ జట్లపై పాక్, కివీస్ గెలిచే అవకాశాలే ఎక్కువ.
టాస్ ఓడి తొలుత బ్యాట్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్తో ఓపెనింగ్కు వచ్చిన ఇషాన్ కిషాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఏడు బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన రోహిత్ శర్మ(14)తో కలిసి కెఎల్ రాహుల్(18) కాస్త కుదురుకున్నట్లే కనిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) పెవిలియన్ చేరారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నలుగురూ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్ కావడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(23)తో కలిసి రిషబ్ పంత్(12) టీమిండియా ఇన్నింగ్సను ఆదుకుంటాడని సగటు అభిమానికి మరోసారి నిరాశ ఎదురైంది. కివీస్ బౌలర్ మిల్నూ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 15 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే. శార్దూల్ ఠాకూర్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
చివర్లో రవీంద్ర జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2, సౌథీ, మిల్నే చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం కివీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్షాన్ని ఛేదించింది. ఓపెనర్ మిచెల్ (49)అద్భుత ఇన్నింగ్స్కు తోడు మార్టిన్ గుప్తిల్(20), కెప్టెన్ కేన్ విలియమ్సన్(33 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.