Sunday, April 28, 2024

ఫార్మా సిటీ రద్దు చేయం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరి దారిలో మెట్రో లైన్ నిర్మాణం

మనతెలంగాణ/హైదరాబాద్: మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడంలేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలు దృ ష్టిలో ఉంచుకొని దానిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన మార్గంతో పోలిస్తే దూరం తగ్గేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన తెలిపా రు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిహెచ్‌ఈఎల్  నుంచి విమానశ్రయం వరకు 32 కిలోమీటర్లు వస్తుండగా దానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల గురించి ఆయన వివరించారు.

ఎంజీబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోలైన్ నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ,ఓవైసీ ఆస్పత్రి మీదుగా మరో చాంద్రాయణగుట్ట వరకు మరో లైన్ నిర్మాణం. దీనిని చాంద్రాయణగుట్ట వద్ద ఎంజిబిఎస్ నుంచి విమానాశ్రాయానికి వచ్చే మెట్రోలైన్‌తో లింక్ చేస్తాం అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టు మెట్రోలో వెళ్లేవారు తక్కువగా ఉంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో లైన్ల నిర్మాణాలకు గత ప్రభుత్వం రూపొందించిన దానికంటే తక్కువ ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య ప్రత్యేకంగా జీరో కాలుష్యంతో క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు గృహనిర్మాణం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు.
నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు
యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్‌పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 100 పడకల ఆస్పత్రి ఉన్న వైద్యశాలలో నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌వర్క్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని వివరించారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు
ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని రేవంత్ తెలిపారు. మంత్రులకు ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన పిసిసి విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నాకు దగ్గరి బంధువుకో పదవులు ఇచ్చేది ఉండదు. తాను ఏదీ చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులను భర్తీ చేస్తాం..
ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి భర్తీ తరువాతే జర్నలిస్టుల సమస్యలకు మోక్షం
ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని భర్తీ చేసిన తర్వాతనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించానని ఆయన గుర్తు చేశారు. వారికి అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించే బాధ్యత తనదన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేలా చూస్తామన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి ఉండదన్నారు. ఈ సమస్యలన్నీ 100 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా అధికారులు చూడాలి
హైదరాబాద్ కమిషనరేట్‌లకు కమిషనర్లను నియమించా. వారికి అవసరమైన మాన్ పవర్‌ను వాళ్లే నియమించుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తాను చూస్తానని వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సిఎం సూచించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేట్లు చూస్తానని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News