బాలాసోర్ : భారతదేశం స్వదేశీ నిర్మిత అణు సామర్థ్యపు శౌర్య క్షిపణిని శనివారం విజయవంతంగా ప్రయోగించింది. శబ్ధవేగాన్ని మించి వెళ్లే ఈ హైపర్సోనిక్ మిస్సైల్ వేయి కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్షాన్ని ఛేదించగలదు. దీనికి సంబంధించిన సామర్థ్యపు పరీక్షను ఒడిషా తీరంలోని ప్రయోగస్థలి నుంచి నిర్వహించారు. ఈ ప్రయోగం అన్ని దశల్లోనూ విజయవంతం అయిందని రక్షణ వర్గాలు ఆ తరువాత ఉత్సాహంగా అధికారికంగా ప్రకటించాయి. శౌర్య పేరుకు తగ్గట్లుగా శౌర్యానికి ప్రతీకంగా ఉంటుంది.
దీని నుంచి కనీసం 700 కిలోమీటర్లు, గరిష్టంగా వేయి కిలోమీటర్ల దూరంలోని లక్షాన్ని దెబ్బతీవయచ్చు. 200 కిలోల నుంచి వేయి కిలోల వరకూ బరువుండే ఆయుధాలు ఇతర సామాగ్రిని ఈ క్షిపణి తీసుకువెళ్లగల్గుతుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి అత్యంత వేగంతో దూసుకువెళ్లే సమర్థతను ఈ మిస్సైల్ సంతరించుకుందనే విషయం ఇప్పటి పరీక్షతో నిర్థారణ అయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎపిజె అబ్దుల్ కలాం ఐలాండ్ ప్రాంతంలోని సమీకృత పరీక్షా స్థావరం (ఐటిఆర్) నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు దీనిని పరీక్షించారు. అనుకున్న లక్షాన్ని ఇది అనుకున్నట్లుగానే ఛేదించిందని రక్షణ వర్గాలు తెలిపాయి.