పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ల మధ్య శత్రుత్వం ఇంకా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పాక్తో ఏ స్థాయిలో కూడా ఆటల్లో పాల్గొనట్లేదని భారత్ చెబుతోంది. అయితే తాజాగా పాకిస్థాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంది. అది క్రికెట్ కాదు.. హాకీ టోర్నమెంట్. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్-2025 నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ బిహార్లోని రాజ్గిర్లో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకూ జరగనుంది. ఇందులో భద్రతా కారణాలను చూపిస్తూ.. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు తొలుత వీసాలకు ధరఖాస్తు చేసింది. భారత ప్రభుత్వం కూడా పాక్ ఆటగాళ్ల వీసాలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లోపే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుందట. ‘‘పిహెచ్ఎఫ్ బుధవారం ఆసియా హాకీ సమాఖ్యకు ఒక లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్లో పాల్గొనడం లేదని అందులో పేర్కొంది. బంగ్లాదేశ్ జట్టును తమ దేశంలో ఆడేందుకు ఆహ్వానించింది’’ అని హాకీ ఇండియా అధికారి ఒకరు వెల్లడించారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.