సముద్ర యానం బిల్లుకు పార్లమెంటు ఆమోదం
విపక్షాల గొడవ మధ్యే ఆమోదించిన రాజ్యసభ, వాయిదా
లోక్సభలోను కొనసాగిన వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: సముద్రయానానికి సహాయకారుల బిల్లు 2021కి పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్ల్లు యావత్ భారత దేశానికి వర్తిస్తుంది. దీంతో దీపస్తంభాలకు వర్తించే లైట్హౌస్ యాక్ట్ 1927 రద్దవుతుంది. సముద్ర ప్రయాణాలకు సహాయకారుల బిల్లు (మెరైన్ ఎయిడ్స్ టు నేవిగేషన్ బిల్లు)కు రాజ్యసభ ప్రతిపక్ష సభ్యుల గొడవ మధ్యనే ఆమోదం తెలిపింది. లోక్సభ గత మార్చి 22నే ఈ బిల్లకు ఆమోదం తెలిపింది.ఈ బిల్ల్లు సముద్రయానానికి సహాయకారిని నిర్వచించింది. నౌకలకు వెలుపల ఉంటూ నౌకల ట్రాఫిక్, నిర్దిష్ట నౌకల సముద్ర యానం భద్రత, సమర్థత పెంచడానికి రూపొందించి నిర్వహించే పరికరం ,వ్యవస్థ లేదా సేవను సముద్ర యానానికి సహాయకారి (మెరైన్ ఎయిడ్)గానిర్వచించింది. సముద్ర యాన సహాయకారులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు డైరెక్టర్ జనరల్ను నియమించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పించింది. అదే విధంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, జిల్లాలకు డైరెక్టరల్సను నియమించేందుకు వీలు కల్పించింది. బిల్లును ఆమోదించిన వెంటనే సభ సాయంత్రం 4 గంటలకు, ఆ తర్వాత బుధవారానికి వాయిదా పడింది.
తొమ్మిది సార్లు వాయిదా పడిన లోక్సభ
కాగాఫోన్లపై నిఘా, రైతు ఉద్యమ సంబంధిత ప్రస్తావనలతో లోక్సభలో మంగళవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఈ అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ అనేక సార్లు వాయిదా పడింది. ఉదయంనుంచి తొమ్మిది సార్లు వాయిదా పడిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు చివరి సారిగా సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాకపోవడంతో సభా స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను బుధవారానికి వాయిదా వేసారు.
Parliament Passed Marine Aids to Navigation bill