Sunday, April 28, 2024

ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది…

- Advertisement -
- Advertisement -

మన్‌కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్యానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ దశాబ్దాల పాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలోదీన్ని గుర్తు చేసుకుంటారని ప్రధాని మోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై ప్రసంగించిన ప్రధాని , దేశం గొప్ప వాణిజ్యశక్తిగా ఉన్నప్పుడు సిల్క్ రూట్‌ను ఉపయోగించదనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీ 20 సదస్సు సందర్భంగా “ ‘ఇండియా మిడిల్ ఈస్ట్‌యూరప్ ఎకనామిక్ కారిడార్’ ను భారత్ సూచించిందని చెప్పారు.

చంద్రయాన్ 3 విజయం, జీ20 సదస్సు నిర్వహణ దేశంలో ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి తనకు వచ్చిన సందేశాల్లో ఎక్కువగా ఈ రెండింటి గురించే ప్రస్తావించినట్టు తెలిపారు. జీ20 అధ్యక్ష హోదాలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా భారత దేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన “భారత్ మండపం” ప్రస్తుతం సెలబ్రిటీగా మారిందని , ప్రజలు దాని ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారని అన్నారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ రంగం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పిస్తుందని , పర్యాటకులను ఆకట్టుకునేందుకు చిత్తశుద్ధి అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. “ జి 20 సదస్సు నిర్వహణ తర్వాత భారత దేశ చిత్తశుద్ధి మరింత పెరిగింది. ఈ సమావేశాల సందర్భంగా భారత్‌కు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు దేశం లోని పలు ప్రాంతాల్లో పర్యటించి , మనసంస్కృతి, వారసత్వ సంపదలు, వైవిధ్యం గురించి తెలుసుకున్నారు. పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్‌కు, కర్ణాటక లోని హోయసల ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కడం ఎంతో గర్వించదగిన విషయం.

ఈ రెండింటి గుర్తింపుతో భారత్‌లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా 42 కు చేరింది” అని ప్రధాని మోడీ అన్నారు. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. దేశం లోని ప్రతిపౌరుడు ఇందులో భాగస్వామి కావాలని కోరారు. అదే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని అభిప్రాయ పడ్డారు. పండగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ పౌరులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్ ’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భారత్‌లో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News