Monday, May 6, 2024

కమాండ్ కంట్రోల్‌తో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం: హోంమంత్రి మహమూద్ ఆలీ

- Advertisement -
- Advertisement -

Police system is further strengthened with command control

మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ టెక్నాలజీతో ఏర్పాటవుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని హోంమంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని, రూ.585 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని, ఇప్పటి వరకూ రూ. 450 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. మరో మూడు నెలలలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని, పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమావేశమై విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పరిష్కరించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పదే పదే చెప్తూ ఉంటారని తదనుగుణంగానే నిధులను కేటాయిస్తూ ఉన్నారని అన్నారు.అదేవిధంగా పోలీసు నియామకాలను భారీ స్థాయిలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ పోలీసు శాఖ అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిచ్చారని, దీంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు అవుతోందని, ఈ సెంటర్ యూనిక్ బిల్డింగ్‌గా నిలిచిపోతుందన్నారు. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ విదేశీ టెక్నాలజీ ఉపయోగించి ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటయ్యాక పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని మంత్రి వివరించారు. అనంతరం రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశామని నేరాలను అరికట్టేందుకు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తామని తెలిపారు.

ఈ సెంటర్ ద్వారా ఒకేసారి లక్షకి పైగా సిసి కెమెరాలను చూసే అవకాశం ఉంటుందని ఈ బిల్డింగ్‌లో మొత్తం ఐదు టవర్స్ ఉన్నాయన్నారు. ఈ సెంటర్‌లో మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నామని వీటిని విద్యార్థులు, ఔత్సాహికులు సందర్శించవచ్చని డిజిపి అన్నారు. పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ భవన నిర్మాణ పనుల గురించి వివరించడంతో పాటు పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు ,రాష్ట్ర అభివృద్ధికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులతో పాటు భవనంలోని అన్ని టవర్లను, డేటా సెంటర్లను, హెలిప్యాడ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్,అడిషనల్ డిజిపి జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఇ ఎన్ సి గణపతి రెడ్డి, డి సి పి లు జోయల్ డేవిస్ సునీత రెడ్డి షాపూర్జీ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News