Thursday, May 2, 2024

28 నుంచి ప్రజా పాలన

- Advertisement -
- Advertisement -

జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు

తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం

మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు
రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరణ
ధరణి సమస్యలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తాం
నిజమైన అభివృద్ది ఏమిటో రాష్ట్ర ప్రజలకు చూపించాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందించే ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు ప్రమాణీకమని, ఆరు గ్యారెంటీలకు ప్రజా పాలన పేరుతో ఈనెల 28వ నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల నుంచి దరఖా స్తులు తీసుకుంటామని, అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. దరఖాస్తులు తీసుకున్న తరువాత అధికారులు రసీదు ఇస్తారని తెలిపారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మరో గ్రామానికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తారని, గ్రామ సభ వద్దకు వచ్చిన ప్రతి ఒకరి వద్ద నుంచి తీసుకుంటారని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.

డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారించడమే ప్రభుత్వ ధ్యేమయని, రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ పాలన అందించమే తమ ముందు ఉన్న లక్షమన్నారు. ఈసందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులుండే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, పోలీస్ అధికారులదేనన్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండే వాళ్లు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అందుకే ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్దిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలని ఆలోచనతో, ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.
అభివృద్ది అంటే అద్దాల మేడలు కాదు:
ఈ సందర్భంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ అభివృద్ది చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది అద్దాల మేడలు కట్టి రంగుల గోడలు చూపించి అభివృద్ది జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిజమైన అభివృద్ది అనేది పౌరుల సమగ్రాభివృద్ది జరిగినప్పుడే చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం , దేశం అభివృద్ది చెందినట్లు తమ పార్టీ భావిస్తుందని వెల్లడించారు. అందుకే నేడు చివరి వరుసలో నిలబడ్డ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం చేరాలనే లక్షంతో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. అవి లబ్దిదారులకు చేరాలంటే చేరవేయవలసిన వారథులు మీరేననని, మీమీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయ హస్తం ద్వారా అమలు చేయబోయో ఆరు గ్యారంటీలను దానికి సంబంధించి వినతిపత్రాలను, అప్లికేషన్లను తీసుకోవాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసు అధికారులు శంకరన్ ని గుర్తు చేసుకోవాలి:
అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అఖిల భారత సర్వీసెస్ అధికారుల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ, మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్‌ఆర్. శంకరన్ ని అని, ఆయన జీవితకాలం సచివాలయానికి ఉదయం 9.30 గంటలకు నడుచుకుంటూ వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి దస్త్రం క్షుణ్ణంగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారని, ఆయన ఐఎఎస్ అధికారులకు ఒక ఆదర్శప్రాయమైన అధికారిగా నిలబడ్డవారని మీరంతా ప్రతిరోజు ఉదయం విధులకు ముందు ఎస్‌ఆర్ శంకర్ ను గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మన విధానంలో మార్పు వస్తుందన్నారు. ప్రజలకు అది ఉపయోపడుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నానని, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారని, సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతం, ఇలాంటివి నేను ఆశించను. నేను నా బాధ్యత నెరువేరుస్తానని ఎస్.ఆర్.శంకరన్ వినయంగా, వినమ్రతతో కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ అవార్డు తిరస్కరించడం ద్వారా ఆయన గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా, చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుందని పరిపాలనలో నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగంగా మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించడానికి మీరంతా రాష్ట్రానికి వచ్చారు మాది ఏదో రాష్ట్రమనో, భాష వేరే అని మీరెవరు భావించవలసిన అవసరం లేదన్నారు. ప్రజల మనసులు అధికారులు గెలిచి విశ్వాసంతో నమ్మకంతో పనిచేసి, జవాబుదారితనంతో వ్యవహరించాలన్నారు.

అధికారులు మానవీయకోణంలో ఆలోచించాలి: 
అధికారుల్లో మానవీయ కోణం ఉండాలని చట్టాలను అమలు చేసేటప్పుడు మానవీయ కోణమున్నప్పుడు 99 శాతం పేద ప్రజలు తీసుకువచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందని తెలిపారు. మన దగ్గరికి వచ్చినవారి సమస్యలు ఎలా పరిష్కరించాలో పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని, ప్రజలు మనదగ్గరికి ఏ కాగితం వచ్చినా ఎట్లా తిరస్కరించాలే అనే ఆలోచనతో మనం ముందుకువెళితే ఈ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది , సంక్షేమం సరైన దిశగా ప్రయాణం చేయదన్నారు. దేశంలో వుండే మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ప్రత్యేకత ఉందని, స్వేచ్ఛను హరించాలని, సామాజిక న్యాయాన్ని దెబ్బతీయడం, సమానమైన అభివృద్దిని దృష్టిలో పెట్టుకోకపోతే.. ఇక్కడి ప్రజల తిరుగుబాటు చేస్తారని చెప్పారు. అధికారులు ప్రజల్లోకి వెళ్లేట్పప్పుడు, కలిసేటప్పుడు వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందని అనే విషయం గుర్తు చేసుకోని వారితో మెలగాలన్నారు. బాధ్యతాయుతంగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, పేరుకుపోయిన సమస్యల చిక్కుముడులను విప్పడం ద్వారా ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ పాలన ప్రజల సొంతమన్నారు.
క్రిమినల్స్ పట్ల ప్రెండ్లీ పోలీసు కాదు, సామాన్యులపట్ల ఫ్రెండ్లీ: 
పోలీసు అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించిందని, అప్పుడప్పుడు ప్రసార మాధ్యమాల్లో చూశానని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని.. ఫ్రెండ్లీ పోలీసింగ్  పౌరునితో ఉండాలని, క్రిమినల్స్‌తో కాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్ తో కాదు గంజాయి, హెరాయిన్, కొకైన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం. నేరాలు, హత్యలు చేసిన వాళ్లు పోలీస్ స్టేషన్ కు వస్తే వాళ్లను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే అతను ఏమి చెబుతున్నాడో వారిని కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. గతంలో తీవ్రవాదులను, ఐఎస్ఐ లాంటి వాళ్లను కూకటి వేళ్లతో పెకిలించడానికి, నిర్మూలించడానికి ఏ రకంగా అయితే కఠినమైన చర్యలు తీసుకున్నారో, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారో ఈ డ్రగ్ మహమ్మారినికి కూడా నిర్మూలించేందుకు అలాగే కృషిచేయాలని సూచించారు. పోలీస్ శాఖకు, అధికారులకు తాను ఇక్కడి నుంచి ఇచ్చే ఆదేశాలతో ఉక్కు పాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉందని, గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ నెల 31 రాత్రి సన్ బర్న్ పార్టీకి సంబంధించి టికెట్టు విక్రయిస్తున్నారని, 18 సంవత్సరాలలోపు వారికి అనుమతి లేదు, అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి అనుమతి లేదని, కానీ ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దొరుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నేరాల తీరు మారిపోయింది.. పోలీసుల కఠినంగా ఉండాలి: 
ప్రస్తుతం నేరాల నేచర్ మారిపోయిందని, సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారని, పోలీసులు ఇంకా పటిష్టతను పెంచుకోవాలన్నారు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలీస్ అధికారులకు అధికారాలు ఇస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. ఆరుగాలం కష్టపడే రైతు నకిలీ విత్తనాల ద్వారా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నకిలీ విత్తనాలే కారణం. రౌడీషిటర్ల మాదిరిగా నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద పోలీసులు స్టేట్ అంత ఒక యునిట్ కింద క్రిమినల్స్ కోసం ఎలాగైతే డేటా బేస్ తయారుచేసుకుంటారో అలాగే నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పోలీసులు డ్రగ్ మాఫీయాతో సంబంధమున్న వారి ఆస్తులు, ఈడి కేసులు ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారని, నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని? జవాబుదారితనం వారికి ఎందుకు లేదు? చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులకు ఆదేశించారు. మతాల మధ్యలో, కులాల మధ్యలో వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇలా చేసేవారి సమాచారం సేకరించి వారందరిని ఒక లైన్ లోకి తేవాల్సిన అవసరముందని, వారిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచించాలని పేర్కొన్నారు.
రెవెన్యూ శాఖకు పోలీసు శాఖ సహకరించాలి: 
రెవెన్యూ డిపార్ట్ మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుందని,దానికి పోలీసు శాఖ సహకారం అందించాలని, ప్రతి రోజు రెండు సభలు రెండు గ్రామాల్లో చేయాలి. మండలంలో రెండు టీంలు ఉంటే ఒక టీంకు ఎమ్మార్వో, మరో టీఎంకు ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ప్రజా పాలన కోసం శాసన సభ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను డిప్యూట్ చేస్తామని, 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్ ఆఫీసర్లను ఉంటారని, వారు నియోజకవర్గంలో వచ్చి కూర్చుని ప్రతి మండలాన్ని వర్టికల్ కింద డివైడ్ చేస్తారని చెప్పారు.
ఒక వర్టికల్ కు ఎమ్మార్వో, మరో వర్టికల్ కు ఎంపీడీవో బాధ్యత వహిస్తారని, వారి క్రింద ఆఫీసర్లు ఉంటారని, ప్రతి అధికారి రెండు గ్రామాలకు వెళ్లాలని ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామం దరఖాస్తులు తీసుకోవడం వంటి పనులుచేయాలన్నారు.
మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలి: 
పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేసుకోవాలి. గ్రామాలకు సంబంధించి ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలి. మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి. ప్రత్యేక కౌంటర్లు మహిళలకు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలన్నారు.
మిగతావారిని కూడా స్ట్రీం లైను చేసి మొదట వచ్చిన వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తారని తెలిపారు. గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వం సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించాలి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. నిరక్షరాస్యులకు అంగన్ వాడీ, ఆశావర్కర్ల దరఖాస్తులు వివరాలతో నింపించడానికి సహకారం అందించేలా చూడాలి. గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలతో ముందుగానే అప్లికేషన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
గ్రామ సెక్రటరీ అందుబాటులో ఉండాలి:
అందుకే ముందే గ్రామాలకు దరఖాస్తులు పంపించి గ్రామ సెక్రటరీ ద్వారా గ్రామపంచాయతీలు అందుబాటులో పెట్టాలి. ప్రజలకు చాటింపు వేసి తెలియజేయాలి. ఆధారుకార్డు, ఫోటో వంటి వాటి విషయాలు ప్రజలకు ముందే కమ్యుానికేట్ చేయాలి. అమరవీరులు, ఉద్యమ కారులు ఉంటే వారికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్, కేసుల వివరాలు వంటి వాటివి తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే ముందే దరఖాస్తులు అందించడం ద్వారా గందర గోళాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాక్టికల్‌గా అధికారుల అనుభవంతో సమాచారం సేకరించి వీటిని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. అమలు పరిచే క్రమంలో అధికారులకు ఇబ్బంది అనిపిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పోలీసు శాఖలో డిజిపికి తెలియజేయాలి. ఈ విధానంలో పనిచేయడానికి ఇబ్బందిగా ఉంటే మీరు కోరుకుంటే అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి బదిలీచేయడానికి, బాధ్యతలనుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమీ చేయమంటే ప్రభుత్వానికి అభ్యంతరముంటుంది. ప్రభుత్వం ఆదేశాలను బాధ్యతగా నిర్వర్తించాల్సిందేనన్నారు.
18 గంటలు విధులు నిర్వహించకుంటే మరోచోటికి బదిలీ:
ఎవరికైనా ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఇష్టం లేకుంటే ఎక్కువ పనిచేయాల్సి వస్తుదనుకుంటే 18 గంటలు పనిచేయాల్సి వస్తే మానసికంగా, శారీరకంగా ఇబ్బంది మాకు ఎందుకు అనిపిస్తే మాకు చెప్పండి . కలెక్టర్లుగా , ఎస్పీలుగా అక్కడ నుంచి మార్చి వేరోచోటికి బదిలీ చేస్తాం.18 గంటలు పనిచేయకుండా ఉండే ప్రాంతానికి బదిలీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా అధికారులకు సూచిస్తున్నా మీ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కలెక్టర్లుగా, ఎస్పీలుగా మీకుంటుంది. ప్రజలకు డైరెక్టుగా కనెక్టై ప్రజల భావం, భాష అర్ధం చేసుకుని అవకాశముంది. ఇటువంటి అవకాశాన్ని మీ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ కింద మలుచుకోండి. ఇటువంటి అనుభవం మీకు రాదు. తరువాత స్ధాయిలో పదోన్నతులు వచ్చినా మీరు ఆఫీసర్లను మానిటర్ చేయడానికి మాత్రమే పరిమతం అవుతారు కానీ క్షేత్రస్థాయిలో వెళ్లి మీరు అనుభవం సంపాదించడానికి, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం రాదు. దీనిని ఉపయోగించుకుంటారని, అద్భుతంగా పనిచేస్తారని , విషయాలలో ప్రతి నాలుగు నెలలకు గ్రామ సభలను , వ్యవస్థను సమీక్షించుకుందాం.
ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి:
అధికారులు బాగా చదువుకుని ప్యాషన్‌తో వచ్చారని ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉన్నది. మేము ఆలోచన చేసిన దానితో పోల్చితే మీరు ఇంకా ప్రజలకు బెటర్ గా చేయడానికి మీరు సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకుంటుందని మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే చేయగలమని, మీ ఆలోచన పాలసీ కింద కన్వర్ట్ చేసి అమలు చేసేందుకు మీ దగ్గరికి మాత్రమే పంపిస్తాం. మీ సూచనలు సలహాలను ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో తీసుకుంటుంది. జవాబుదారితనం, బాధ్యత చాలా ముఖ్యమైనది. అధికారుల ఇంటిగ్రిటీ, నీతి నిజాయితీ పెద్ద కొలమానని మీకిచ్చే పోస్టింగ్ లో వీటిని పరిగణలోకి తీసుకుంటాం అని చెబుతూ ఈసందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News