భోపాల్: తొమ్మిది నెలల గర్భవతి 500 కిలో మీటర్లు నడిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మధ్య ప్రదేశ్ లోని పన్నాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దినసరి కూలీలు పనులు లేకపోవడంతో పాటు నగరాలలో ఉంటే వైరస్ సోకుతుందనే భయంతో గ్రామాలకు తరలిపోతున్నారు. ప్రజలకు వాహన సదుపాయం లేకపోవడంతో కాలినడకన వందల కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు. మార్చి 29న కలిబాయ్ తన భర్త రామ్దీన్ కేవత్తో కలిసి యుపిలోని మథుర నుంచి నడక ప్రారంభించింది. మార్చ్ 31న యుపిలోని పన్నా జిల్లా బరియాపూర్ భూమియాన్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకొని సరికి ఆమెకు నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుఖ ప్రసవం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిదని డాక్టర్ కెపి రాజ్పూట్ తెలిపాడు. కలిబాయ్, పసకందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎప్రిల్ 2న బాబు జన్మించడంతో రామ్ అని పేరు పెట్టుకున్నామని, శ్రీరామ నవమి ముందు రోజు బాబు జన్మించడంతో ఆ పేరు పెట్టామని తల్లిదండ్రులు తెలిపారు. 500 కిలో మీటర్ల ప్రయాణంలో 220 కిలో మీటర్లు ట్రాక్టర్ డ్రైవర్లు లిఫ్ట్ ఇవ్వడంతో త్వరగా గ్రామానికి చేరుకున్నామని కలిబాయ్ తెలిపింది.