భారత్లో బిట్ కాయిన్ చట్టబద్ధమంటూ అగంతకుల సందేశం
అప్రమత్తమైన పిఎంఓ, ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైంది. ఆదివారంనాడు తెల్లవారుజామున హ్యాకర్లు ఈ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు, ఇది ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) అధికారులు ప్రకటన చేశారు. ప్రజలు ఎవరూ ఆ ట్వీట్ కు స్పందించవద్దని కోరింది. ప్రధాని ట్విటర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన అగతంతకులు బిట్ కాయిన్ గురించి పోస్టు చేశారు. భారత్ లో బిట్ కాయిన్ ను చట్ట బద్ధం చేశారని, ఆ దేశ ప్రభుత్వమే స్వయంగా 500 బిట్ కాయిన్ లను కొనుగోలు చేసి ప్రజలకు సేల్ చేస్తోందని పోస్టు చేశారు. వెంటనే అప్రమత్తమైన ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే ట్విటర్ హ్యాకర్లు చేసిన ట్వీట్ ను తొలగించి, సత్వరమే మోడీ వ్యక్తిగత ఖాతాను పునరుద్ధరించింది. ప్రధాని కార్యాలయంతో తాము నిరంతరం టచ్ లో ఉన్నామని, సరియైన చర్యలు తీసుకున్నామని ట్విటర్ ప్రకటించింది. తాజా హ్యాకింగ్ తో ఇతర ఖాతాలపై ఎలాంటి ప్రభావం పడలేదని గుర్తించామని పేర్కొంది.