Thursday, May 2, 2024

పాఠాలు చెప్పలేదని రూ.24 లక్షలు తిరిగిచ్చేసిన ప్రొఫెసర్

- Advertisement -
- Advertisement -

professor returned Rs 24 lakhs for not teaching lessons

 

పాట్నా : “కరోనా కారణంగా విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు జరిగినా హాజరైంది అరకొర విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేక పోయాను ” అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజీ ప్రొఫెసర్. బీహార్‌కు చెందిన 33 ఏళ్ల లలన్ కుమార్ . ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి హిందీలో మాస్టర్స్ , ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేశారు. ముజఫర్‌పూర్ లోని నితిశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. ఇది బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ ( బీఆర్ ఏబీయూ) అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబర్‌లో లలన్ ఉద్యోగంలో చేరగా, తర్వాత కొన్నాళ్లకే కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్ రావడంతో కాలేజీ మూత పడింది. ఆన్‌లైన్ క్లాసులు జరిగినా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన రెండేళ్ల తొమ్మిది నెలల వేతనాన్ని బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు మంగళవారం తిరిగి ఇచ్చేశారు. కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేక పోయాను.

అందుకే జీతం తీసుకొనేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదన్నారు.. ఈ 33 నెలలకు తీసుకున్న రూ. 23,82,228 వేతన మొత్తాన్ని లలన్ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. ఈ ప్రొఫెసర్ చర్యను బీఆర్‌ఏబీయూ రిజిస్ట్రార్ అభినందించారు. అయితే లలన్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్‌మెంట్‌లో బదిలీకి అభ్యర్థన పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్శిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితిశేశ్వర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయితే లలన్ క్లాసులకు పిల్లలు హాజరు కాకపోవడంతో బీఆర్‌ఏబీయూ యూనివర్శిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించినట్టు సమాచారం. నితిశేశ్వర్ కాలేజీలో దాదాపు 3 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, ఇందులో 1100 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు. లలన్ ఒక్కడే ఈ కాలేజీలో రెగ్యులర్ హిందీ టీచర్. అతడితోపాటు మరో గెస్ట్ లెక్చరర్ అప్పుడప్పుడు కళాశాలకు వస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News