Sunday, April 28, 2024

ఆలయాన్ని నిర్మించడం కన్నా కాపాడడమే కష్టం

- Advertisement -
- Advertisement -

అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యుడి మనోగతం

లక్నో: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం త్వరలో జరగనున్న తరుణంలో హిందూ పౌరాణిక గ్రంథాల నుంచి తమ పిల్లలకు పేర్లను ఎంపిక చేసుకుని భారతీయ సంస్కృతిని అలవరచాలని అయోధ్య ఆలయ ట్రస్టు సీనియర్ సభ్యుడు స్వామి విశ్వప్రసన్న తీర్థ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయాన్ని నిర్మించడం కన్నా పరిరక్షించడమే చాలా కష్టమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

శతాబ్దాలుగా హిందువులు కంటున్న కల నెరవేరిందని, అయితే మన బాధ్యతలు ఇంతటితో తీరిపోయాయని భావించరాదని ఆయన సూచించారు. ఆలయం ఎన్ని సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా అదే రూపంలో ఉంటుందని, దానికి ఎవరూ హాని తలపెట్టకుండా ఉండాలని మనం ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పిల్లలు హిందువులు మిగిలేంతవరకు, హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉండేంతవరకు ఆలయం ఆలయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. అప్ఘానిస్తాన్‌నే ఉదాహరణగా తీసుకోండి..అక్కడ బుద్ధుడి విగ్రహాలు ఎలా ధ్వంసమయ్యాయో చూడండి అంటూ ఆని చెప్పారు.

మనం కలకాలం జీవించబోమని, కాని మన హిందూ ధధర్మం, సనాతన ధర్మం విలువలను మన పిల్లలకు నేర్పించాలని ఆయన చెప్పారు. మన సంస్కృతిని సంతతికి(పిల్లలు) అలవరచడం ద్వారా దాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని స్వామి విశ్వప్రసన్న తీర్థ తెలిపారు. పేర్ల మార్పు(మనుషుల) ప్రచారం జరగాలని, అది బహిరంగంగా ఆలయాలలో జరగాలని ఆయన పిలుపునిచ్చారు.

మత మార్పిడులు ఆగిపోయి సంస్కృతిని బోధించే పాఠాలు ప్రారంభం కావాలి అని ఆయన తెలిపారు. సీతాదేవి విగ్రహాన్ని కూడా అయోధ్య రామాలయంలో ప్రతిష్టించాలన్న టీవీ సీరియల్ రామాయణంలో సీత పాత్రధారి దీపికా చిక్లియా చేసిన డిమాండును ప్రస్తావిస్తూ శ్రీరాముడి విగ్రహంతోపాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఆలయంలో ప్రతిష్టించడం జరుగుతుందని స్వామీజీ తెలిపారు.

ఆలయంలో రాముడి కుటుంబ సభ్యులైన సీతాదేవితోపాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. ఆలయ ప్రాణ ప్రతిష్ట అనంతరం 48 రోజుల మండల పూజ కూడా తన పర్యవేక్షణలో ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి అయోధ్యకు ఒకనాటి అయోధ్యకుగల తేడాను వివరిస్తూ కలియుగం నుంచి త్రేతాయుగానికి అయోధ్య మారిపోయినట్లు కనపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News