న్యూఢిల్లీ: గతంతో పోల్చితే ప్రస్తుతం క్రికెట్కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుందని, ఇలాంటి స్థితిలో ఈ ఆటకు విశ్వ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్లో చోటు కల్పించాలని భారత క్రికెట్ దిగ్గజ రాహుల్ ద్రావిడ్ సూచించాడు. భారత్లో క్రికెట్ ఓ మతంలాంటిదని, ఈ ఆటకు కోట్లాది మంది నీరాజనం పలుకుతారనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇలా ఎంతో జనాదారణ కలిగిన క్రికెట్కు ఒలింపిక్స్ వంటి మెగా క్రీడల్లో చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందన్నాడు. ఫుట్బాల్, టెన్నిస్ తర్వాత ప్రపంచ క్రీడా రంగంలో క్రికెట్కే అత్యంత ఆదరణ ఉందన్నాడు. ఇలాంటి జనాదారణ కలిగిన ఆటను ఒలింపిక్స్ వంటి క్రీడల్లో చోటు లేక పోవడం వెలితిగానే కనిపిస్తుందన్నాడు. భవిష్యత్తులో క్రికెట్కు చోటు కల్పించాల్సిన అవసరం ప్రపంచ ఒలింపిక్స్ సమాఖ్యపై ఉందని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో కాకుంటే కనీసం టి20 ఫార్మాట్లోనైన ఒలింపిక్స్లో క్రికెట్ను ఆడించాలన్నాడు. అప్పుడే క్రికెట్కు నిజమైన విలువ దక్కుతుందన్నాడు. భారత ఉపఖండంతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కరీబియన్, ఆఫ్రికాలలో క్రికెట్కు ఎంతో ఆదరణ ఉందని, దీంతో ఒలింపిక్స్లో దీనికి చోటు కల్పిస్తే మెగా క్రీడలకు మరింత జోష్ లభిస్తుందని ద్రావిడ్ జోస్యం చెప్పాడు.