హోటల్ సమీపంలో కూలిన విమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత క్రికెట్ జట్టు సిడ్నీలోని ఓ హోటల్లో బస చేస్తోంది. అయితే టీమిండియా బస చేస్తున్న హోటల్ సమీపంలో తాజాగా భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారగా ఉలిక్కి పడ్డారు. భారత జట్టు ఉంటున్న ఒలింపిక్ పార్క్ హోటల్ సమీపంలో ఓ చార్టెడ్ విమానం కుప్పకూలింది. విమానం కుప్పకూలిన ప్రదేశం భారత క్రికెటర్లు ఉంటున్న హోటల్కు చాలా దగ్గర్లో ఉంది. ఈ ఘటన జరగడంతో భారత క్రికెటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక విమానం కూలిన స్టేడియం ప్రాంతంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్బాల్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. విమానం కూలిన వెంటనే వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. చాలా మంది అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా, విమానం కూలిన ప్రదేశంలో ప్రజలు ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇక భారత ఆటగాళ్లకు ఈ సంఘటన తీవ్ర షాక్కు గురి చేసింది. ఇదిలావుంటే విమానం ఒక వేళ భారత క్రికెటర్లు ఉంటున్న హోటల్పై పడి ఉంటే పెను ప్రమాదమే సంభవించేదని స్థానికులు పేర్కొంటున్నారు.